ద్రవిడ్ నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు
2007 జులైలో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. లార్డ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అనంతరం నాటింగ్హామ్లో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆగస్టు 9న ఓవల్ వేదికగా మూడో టెస్టు
ఓవల్ వేదికగా ఆగస్టు 9న ఇరు జట్ల మధ్య ఈ సిరీస్లో చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన రాహుల్ ద్రవిడ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ దినేశ్ కార్తీక్(91), రాహుల్ ద్రవిడ్(55), సచిన్ చెండూల్కర్ (82), వీవీఎస్ లక్ష్మణ్ (51), ధోనీ(92) పరుగులతో రాణించారు.
ఆగస్టు 10న సెంచరీ నమోదు చేసిన కుంబ్లే
వీరంతా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అనిల్ కుంబ్లే రెండో రోజు ఆటలో(ఆగస్టు 10న) భాగంగా సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తం 193 బంతులు ఎదుర్కొన్న కుంబ్లే 16 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 110 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. జట్టు స్కోరు 664 పరుగుల వద్ద శ్రీశాంత్ ఔటవ్వడంతో భారత్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది.
రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 5 వికెట్లు తీసిన కుంబ్లే
ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కుంబ్లేకు 5 వికెట్లు కూడా దక్కాయి. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం కోహ్లీసేన కూడా ఇంగ్లాండ్లో పర్యటిస్తోండటంతో కుంబ్లే సెంచరీని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
1990లో భారత్ తరఫున అరంగేట్రం
కాగా, 1990లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లే టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి 17 ఏళ్లు పట్టింది. కుంబ్లే తన 389వ మ్యాచ్లో సెంచరీ సాధించాడు. భారత్ తరఫున పెద్ద వయస్సులో సెంచరీ సాధించిన రికార్డు కూడా కుంబ్లే పేరిట ఉంది. 36ఏళ్ల 296 రోజుల వయస్సులో కుంబ్లే సెంచరీ సాధించాడు. 2007లో వన్డేలకు, 2008లో టెస్టులకు కుంబ్లే వీడ్కోలు పలికాడు.