
కరాచీ: మన దేశ హీరోల్ని గౌరవించుకునే విధానం ఇదేనా అంటూ పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తాజాగా దుబాయ్లో జరిగిన బాక్సింగ్ బౌట్లో ఫిలీప్పిన్స్ బాక్సర్ కార్నడో తనోమోర్ను పాకిస్థాన్ బాక్సర్ మహ్మద్ వసీం కేవలం 82 సెకండ్లలో నాకౌట్ చేసి విజయం సాధించాడు. విజయానంతరం స్వదేశానికి వచ్చిన వసీంకు నిరాశే ఎదురైంది. దేశం తరఫున విజయం సాధిస్తే అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక పాక్ ప్రభుత్వం కూడా వసీంకు విమానాశ్రయంలో కనీస స్వాగత ఏర్పాట్లు కూడా చేయలేదు.
ఈ ఘటనతో అసంతృప్తి చెందిన వసీం తన ట్విట్టర్ వేదికగా తన అక్కసును వెళ్లగక్కాడు. 'పాకిస్తాన్ దేశం తరపున ప్రపంచ వేదికపై సత్తా చాటడానికి మాత్రమే వెళ్ళాను. విమానాశ్రయంలో ఘన స్వాగతాల కోసం నేను పోరాటం చేయడం లేదు. ప్రతీ పోరాటం, ప్రతీ క్యాంప్, ప్రతీ టూర్, ప్రతీ ట్రైయినింగ్ నాకు ముఖ్యమే. పాకిస్తాన్ బాక్సింగ్ టాలెంట్ను ప్రపంచం గుర్తించాలనే కోరుకుంటున్నా' అని రాసుకొచ్చాడు.
దీనిపై వసీం అక్రమ్ స్పందించాడు. 'వసీంకు పాక్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. దేశం తరఫున ఎవరైనా సత్తా చాటితే వారిని గుర్తించాలి. మన హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో గుర్తు పెట్టుకోవాలి. నీకు ఇవే నా క్షమాపణలు. నువ్వు తర్వాత బౌట్లో గెలిచినప్పడు నేనే స్వయంగా ఎయిర్పోర్ట్కు రిసీవ్ చేసుకుంటా. నీ విజయానికి ఇవే నా అభినందలు' అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ పది బౌట్లలో పాల్గొన్న మహ్మద్ వసీం.. ఒకదాంట్లో మాత్రమే పరాజయం చూసాడు.