
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర పాటు వాయిదా పడిన ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020 జపాన్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్ 2020లో ప్రపంచంలోని అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. భారత ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. పలు విభాగాల్లో భారత అథ్లెట్లు ఇప్పటికే ఐదు పతకాలను సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. దీంతో పతక విజేతలపై ప్రశంసలు, రివార్డుల వర్షం కురుస్తోంది. అయితే పొట్ట కూటికోసం ఓ యువ మహిళా బాక్సర్ రోడ్డున పడింది. ఈ ఘటన క్రీడాభిమానుల్లోనూ, క్రీడాకారుల్లోనూ కలకలం రేపింది.
చండీగఢ్లో యువ బాక్సర్ రీతు పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తనకు ప్రోత్సాహం లేకపోవడంతో తనకిష్టమైన బాక్సింగ్ను వదిలి వేసింది. చివరకి గత్యంతరం లేక తన కుటుంబానికి అండగా ఉండేందుకు చండీగఢ్లో పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తాను జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్లు ఆడి, పతకాలు సాధించానని రీతూ ఓ జాతీయ మీడియాకు తెలిపింది. క్రీడాకారిణిగా తనకు తన కుటుంబం చాలా అండగా నిలిచిందని తెలిపింది. కానీ తనకు ఎలాంటి ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు రాలేదని రీతు చెప్పింది. తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానంది.
అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు, ఆర్థిక అవసరాల కోసం తనకెంతో ఇష్టమైన క్రీడలను విడిచిపెట్టాల్సి వచ్చిందని యువ బాక్సర్ రీతు చెప్పుకొచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయం చేస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది. దేశంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రీడాకారులను ఎవ్వరు గుర్తించడం లేదు. 130 కోట్లు ఉన్న భారత జనాభాలో ఎన్ని ఒలింపిక్ పతకాలు వస్తున్నాయనేది అందరు ఆలోచించాల్సిన ప్రశ్న. అందులో ఎన్ని బంగారు పతకాలు ఉంటున్నాయో కూడా అందరికి తెలుసు. సరైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే భారతదేశం కూడా పతకాల పట్టికలో ప్రపంచ దేశాలోతో పోటీ పడుతుంది. రీతు లాంటి ఎందరో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కేవలం బాక్సర్ మాత్రమే కాదు.. క్రికెటర్లు కూడా రోడ్డున పడ్డారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, 2015 ప్రపంచకప్ విజేత జేవియర్ డోహెర్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక కష్టాలు భరించలేక పొట్ట కూటి కోసం కార్పెంటర్గా మారాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన డోహెర్టీ 2001-02 సీజన్లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసి.. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ అనంతరం ఆటకు గుడ్బై చెప్పాడు. మైకేల్ క్లార్క్ నేతృత్వంలో 2015 ప్రపంచకప్ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ అతడు సభ్యుడు. ఆ మెగా టోర్నీలో ఏకైక మ్యాచ్ ఆడిన జేవియర్.. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ తీయకుండా 60 రన్స్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.