హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన మహిళల 51 కేజీల ట్రయల్ ఫైనల్ బౌట్లో మేరీకోమ్ 9-1 పాయింట్ల తేడాతో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ను ఓడించింది. ఈ విజయంతో ఈ కేటగిరీలో ఒలింపిక్ క్వాలిఫయర్స్లో మేరీ పోటీపడనుంది.
'వైద్యుడి సలహా మేరకే భవిష్యత్ కార్యాచరణ.. ఎప్పుడు జట్టులోకి వస్తానో స్పష్టత లేదు'
బౌట్ ముగిసిన తర్వాత మేరీకోమ్ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్య పరిచింది. కనీసం నిఖత్తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. నిఖత్ తీరు నచ్చకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని మేరీకోమ్ బాహాటంగానే తెలిపింది. మరోవైపు.. బౌట్ ముగిశాక మేరీకోమ్ ప్రవర్తన బాగోలేదు. ఓ సీనియర్ దిగ్గజం నా ప్రదర్శనకు మెచ్చి హత్తుకుంటుందనుకుంటే.. కనీసం చేయి కూడా కలపలేదు. ఇది నన్ను తీవ్రంగా బాధించింది అని నిఖత్ పేర్కొంది. బౌట్ అనంతరం ఇద్దరూ తమ భావోద్వేగాలను ప్రదర్శించారు.
గత కొన్ని నెలలుగా నిఖత్ చేసిన ప్రతిదాన్ని మేరీ వ్యక్తిగతంగా తీసుకున్నట్లు అందరికి స్పష్టమైంది. అయినప్పటికీ నిఖత్ తన పోరాటం మేరీకి వ్యతిరేకంగా కాదు అని అంటోంది. తనను తాను నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు ఇవ్వాలని వ్యవస్థ (ఫెడరేషన్)కు వ్యతిరేకంగా పోరాడుతున్నా అని నిఖత్ అంటోంది.
ఆదివారం నిఖత్ మాట్లాడుతూ... 'ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఇది నాకు చాలా కొత్తగా ఉంది. ట్విట్టర్ ద్వారా క్రీడా మంత్రికి లేఖ రాసినందుకు మేరీకి నాపై ఇంత కోపం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వ్యక్తిగతంగా తీసుకుంటే నేను ఏం చేయలేను. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. అంతేకాని మేరీకోమ్కు వ్యతిరేకంగా కాదు' అని పేర్కొంది.
'మేరీ ఒక లెజెండ్. ఆమె ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా ఆమె ముందు జూనియర్లం. ఆమె ఎప్పుడూ ట్రయల్స్కు సిద్ధంగా ఉండాలి. అలాగే యువతకు మంచి ఉదాహరణగా నిలవాలి. మేరీ నన్ను ఓడించి ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఆడుతుండడంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ లోపం ఉందో మనం తెలుసుకోవాలి. అందుకోసం నేను గొంతు ఎత్తా. ప్రతి పోటీకి ముందు ఒక ట్రయల్ ఉండాలి. నేను మ్యాచ్ ఓడిపోయాను కానీ ఆ రోజు నేను అందరి హృదయాలను గెలుచుకున్నా. నేను సంతోషంగా ఉన్నా' అని నిఖత్ తెలిపింది.