
హైదరాబాద్: ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్... తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ల మధ్య ట్రయల్ ఫైట్ జరగనుందా? అంటే అవుననే తెలుస్తోంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో భాగంగా చైనాలో జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్కు 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్ను పంపడానికి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న నిఖత్ జరీన్... మేరీ కోమ్తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్కు ఎంపిక చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. టోక్యో ఒలింపిక్స్ కోసం మేరీ 48 కేజీల విభాగం నుంచి 51 కేజీలకు మారింది. నిఖత్ జరీన్ కూడా 51 కేజీల విభాగంలోనే పోటీ పడుతుండటంతో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్ నిర్వహించాలంటూ కోరుతుంది.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) వీరిద్దరి మధ్య సెలక్షన్ ట్రయల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. జాతీయ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం డిసెంబర్ చివరి వారంలో వీరిద్దరికీ మధ్య ఫైట్ నిర్వహించేందుకు బీఎఫ్ఐ సిద్ధమైంది.
ఈ మేరకు బీఎఫ్ఐ ఉన్నతాధికారులు ఒకరు మాట్లాడుతూ "మేము మా నియమాలకు కట్టుబడి ఉన్నాము. ఈ విషయంపై తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు. ప్రతిదీ ఇప్పుడు స్పష్టంగా ఉంది, అయోమయం లేదు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) జరగనుంది. ఆ తర్వాత మేరీకోమ్-జరీన్లకు ట్రయల్స్ ఏర్పాటుపై విచారణ జరుగుతుంది" అని అన్నారు.
అసలేం జరిగింది?
2020లో జరిగే ఒలింపిక్స్కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గాను వచ్చే ఫిబ్రవరిలో ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగుతాయి. ఇందులో పాల్గొనే బాక్సర్లను ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయాలి. కానీ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) మాత్రం ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన విజేతలను నేరుగా ఎంపిక చేసింది.
రష్యాలోని ఉలాన్ ఉదెలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో మేరీకోమ్ కాంస్య పతకం సాధించింది. అయితే టోక్యో ఒలింపిక్స్ కోసం మేరీ 48 కేజీల విభాగం నుంచి 51 కేజీలకు మారింది. ఇదే ఇప్పుడు నిఖత్ జరీన్కు శాపంగా మారింది. మొదటి నుంచీ 51 కేజీల బరిలో రాణిస్తోన్న నిఖత్ జరీన్కు మేరీ అడ్డుగా మారింది.
మేరీ కోమ్ స్టార్ బాక్సర్ కావడంతో భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) ఆమెకే మద్దతుగా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత్ తరఫున మేరీకోమ్ను పంపాలనుకుంటున్నట్లు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్సింగ్ చెప్పకనే చెప్పాడు.
దీంతో తాను పోటీ పడే 51 కేజీల విభాగంలో సెలక్షన్ ట్రయల్సే లేకుండా మేరీకోమ్ను నేరుగా పంపడాన్ని నిఖత్ జరీన్ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజ్జుకు సైతం నిఖత్ లేఖ కూడా రాశారు. నిఖత్ జరీన్ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి రిజుజు తన ట్విట్టర్లో దేశ ప్రయోజనాలు, క్రీడలు, అథ్లెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
అంతేకాదు క్రీడాకారుల ఎంపికలో మంత్రి జోక్యం ఉండదని.. సెలక్షన్ కమిటీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే, ఈ వివాదాన్ని కేంద్ర మంత్రి వరకు తీసుకు వెళ్లడంపై మేరీకోమ్ శనివారం స్పందించారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నడుచుకోవడమే తనకు తెలుసునని మేరీకోమ్ అన్నారు.