
హైదరాబాద్: ఒలింపిక్స్ టోర్నీ ప్రతి ఒక్క అథ్లెట్ ఆడాలనుకునే టోర్నీ. అలాంటి టోర్నీలో స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కోసం రెండోసారి తన కెరీర్ను పక్కన పెట్టిన వైనంపై హైదరాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆవేదన వ్యక్తంజేసింది. సెలెక్షన్స్ నిర్వహించకుండా టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి మేరీని పంపాలనుకుంటున్న భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) తీరుపై కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజుకు లేఖ రాసింది.
2020లో జరిగే ఒలింపిక్స్కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గాను వచ్చే ఫిబ్రవరిలో ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగుతాయి. ఇందులో పాల్గొనే బాక్సర్లను ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయాలి. కానీ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) మాత్రం ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన విజేతలను నేరుగా ఎంపిక చేసింది.
ఇటీవల రష్యాలోని ఉలాన్ ఉదెలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో మేరీకోమ్ కాంస్య పతకం సాధించింది. అయితే టోక్యో ఒలింపిక్స్ కోసం మేరీ 48 కేజీల విభాగం నుంచి 51 కేజీలకు మారింది. ఇదే ఇప్పుడు నిఖత్ జరీన్కు శాపంగా మారింది. మొదటి నుంచీ 51 కేజీల బరిలో రాణిస్తోన్న నిఖత్ జరీన్కు మేరీ అడ్డుగా మారింది.
మేరీ కోమ్ స్టార్ బాక్సర్ కావడంతో భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) ఆమెకే మద్దతుగా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత్ తరఫున మేరీకోమ్ను పంపాలనుకుంటున్నట్లు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్సింగ్ చెప్పకనే చెప్పాడు. దీంతో తాను పోటీ పడే 51 కేజీల విభాగంలో సెలక్షన్ ట్రయల్సే లేకుండా మేరీకోమ్ను నేరుగా పంపడాన్ని నిఖత్ జరీన్ ప్రశ్నించింది.
ఈ మేరకు తన ట్విట్టర్లో "ఆగస్టు 6, 7 తేదీల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ సెలెక్షన్స్ నిర్వహిస్తామని ఢిల్లీకి పిలిచారు. చివరి నిమిషంలో సెలెక్షన్స్ను రద్దుచేసి మేరీ కోమ్ను టోర్నీకి పంపించారు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, రజతం సాధించిన క్రీడాకారులకు ఒలింపిక్ సెలెక్షన్స్ నుంచి మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. మేరీ కోమ్ కోసం సెలెక్షన్స్ లేకుండా నిబంధనను మార్చి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ప్రతిసారీ తమను తాము నిజాయతీగా నిరూపించుకోవాలన్నది క్రీడల్లో ప్రాథమిక సూత్రం. క్రీడలంటేనే పారదర్శకతకు పేరు. ట్రయల్స్ లేకుండానే నన్ను పక్కనబెట్టడం సరైంది కాదు. 23 ఒలింపిక్స్ స్వర్ణాలు సాధించిన అమెరికన్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ కూడా ట్రయల్స్ ద్వారానే తిరిగి దేశం తరఫున పాల్గొన్నాడు. మనం కూడా అలాగే చేయాలి కదా. అందుకే నాకొక అవకాశం ఇప్పించండి. అదే జరగకపోతే నా శిక్షణకు అర్థమేముంది. మేరీకోమ్ అయినా మరెవరైనా ట్రయల్స్ ద్వారా ఎంపికైతేనే మంచిది" అని కేంద్ర క్రీడల మంత్రికి రాసిన లేఖను ట్వీట్ చేసింది.