చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) గురువారం ర్యాంకులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో 76,895 పాయింట్లు సాధించిన శ్రీకాంత్ నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు.
చైనా ప్లేయర్లు డామినేట్ చేసి మరీ
పురుషుల విభాగంలో చైనా ప్లేయర్లు డామినేట్ చేసే బ్యాడ్మింటన్లో ఓ భారత షట్లర్కు నెంబర్వన్ ర్యాంక్ రావడం నిజంగా గర్వకారణం. నిజానికి శ్రీకాంత్ గతేడాది అక్టోబర్లోనే నెంబర్ వన్ ర్యాంకుని అందుకోవాల్సి ఉంది. అయితే గాయం కారణంగా అందుకోలేకపోయాడు. రెండు రోజుల క్రితం కామన్వెల్త్ గేమ్స్లో భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం పసిడి గెలవడంలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
76,895 పాయింట్లతో అగ్రస్థానంలో
దీంతో శ్రీకాంత్ 76,895 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 77,130 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న డెన్మార్క్ ప్లేయర్ అలెక్సన్ 1,660 పాయింట్లు కోల్పోయి 75,470తో రెండో స్థానానికి పడిపోయాడు.కొరియాకి చెందిన సన్ వాన్ హో 74670 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. చైనా షట్లర్లు చెన్ లాంగ్, షియుకిలు వరుసగా 73466, 72743 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
నంబర్వన్ ర్యాంకుని అందుకున్న రెండో భారత పురుష షట్లర్గా
52 వారాల వ్యవధిలో అత్యుత్తమ 10 టోర్నీల ప్రదర్శన ఆధారంగా బీడబ్ల్యూఎఫ్ ఈ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. దీంతో నంబర్వన్ ర్యాంకుని అందుకున్న రెండో భారత పురుష షట్లర్గా కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టక ముందు 1980లో ప్రకాశ్ పదుకొణె నంబర్వన్గా నిలిచాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ఆ ఘనతను అందుకున్నాడు.