
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు శనివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నగరంలోని పుల్లెల గోపీచంద్ ఇంటర్నేషన్ అకాడమీలో పీవీ సింధు మూడు కదంబ మొక్కలను నాటారు. హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పీవీ సింధు మొక్కలు నాటిన ఫోటోలను తన ట్విట్టర్లో పంచుకుంది. "నన్ను నామినేట్ చేసినందుకు తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఈ ఛాలెంజ్ను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇస్తున్నాను" అని సిందు కామెంట్ పెట్టారు.
"ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ ఛాలెంజ్ను స్వీకరించిన వారు మూడు మొక్కలు నాటడంతో పాటు ముగ్గురిని నామినేట్ చేయాలి. ఇంతటి గొప్ప కారణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. నేను కోహ్లీ, అక్షయ్ కుమార్, సానియా మిర్జాలను నామినేట్ చేస్తున్నా" అని సింధు రెండో ట్వీట్లో పోస్టు చేశారు.