న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక పురస్కారం ముంగిట నిలిచింది. 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్'అవార్డుకు సింధు నామినేట్ అయ్యింది. సింధుతో పాటు టోక్యో సిల్వర్ మెడలిస్ట్, వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను, స్టార్ గోల్ఫర్ అదితి అశోక్, బాక్సర్ లవ్లీనా బోర్గాహైన్, పారా షూటర్ అవనీ లేఖార పేర్లను బీబీసీ జ్యూరీ నామినేషన్స్కు షార్ట్లిస్ట్ చేసింది.
ఈనెల 28వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ అవార్డు కోసం ఓటింగ్ జరగనుంది. వచ్చేనెల 28న జరగనున్న కార్యక్రమంలో విజేతకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుతో పాటు బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, దిగ్గజ క్రీడాకారిణి, ఉత్తమ యువ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను కూడా ఇవ్వనున్నారు.
ఒలింపిక్స్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా పీవీ సింధు చరిత్రకెక్కింది. 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని, 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్లో రజతం సాధించి 2021 సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించింది. 2022 జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించింది.
2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సింధు 17 ఏళ్ల వయస్సులోనే 2012 సెప్టెంబర్లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 20లోకి అడుగుపెట్టింది. 2019లో 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా గెలుచుకుంది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ ది ఇయర్ అవార్డు రేసులో నిలవడంపై సింధు సంతోషం వ్యక్తం చేసింది. సక్సెస్ అనేది అంత సులువుగా రాదని, దాని వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుందని చెప్పింది. నిరంతం సాధన చేస్తే ఓ స్థాయి చేరగలుతామని పేర్కొంది.