హైదరాబాద్: దేశం మొత్తం ఇప్పుడు పీవీ సింధు నామస్మరణతో మార్మోగుతోంది. రియో ఒలింపిక్స్ 2016లో పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి నోజోమీ పైన గెలుపొందిన ఫైనల్ చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు సింధు ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి మారిన్తో తలపడనుంది.
ఇప్పుడు దేశం యావత్తు సింధు వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం నాడు ఓ సూచన చేశారు. వంద కోట్ల మంది భారతీయులు పతకాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
క్రీడల్లో యువత తమని తాము నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారని చెప్పారు. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుదామని చెప్పారు. 'మిషన్ టోక్యో' పేరిట ఆటగాళ్లను తయారు చేయాలన్నారు. సింధు స్వర్ణం గెలిచి దేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగరేయాలన్నారు.
సింధు విజయం కోరుతూ లాల్ దర్వాజలో పూజలు
తెలుగుతేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రియో ఒలింపిక్స్ ఫైనల్లో విజయం సాధించాలని కాంక్షిస్తూ నగరంలోని లాల్దర్వాజ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది లాల్దర్వాజ సింహవాహినికి పీవీ సింధు బంగారు బోనం సమర్పించింది.
ఒలింపిక్స్లో ఫైనల్కు చేరడంపై సింధు తల్లి విజయ స్పందిస్తూ.. శక్తినంత కూదీసుకుని ఆడాలని సింధుకు సూచించామని, సింధుకు ఎలాంటి ఒత్తిడి లేదని, సంతోషంగా ఉందని, సింధు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపారు. సింధుకు క్రీడలంటే ఎంతో ఆసక్తి అని, సింధు ఇంట్లో కంటే షటిల్ కోర్టులోనే ఎక్కువ గడిపేదన్నారు.
పదేళ్లుగా గోపిచంద్ వద్ద సింధు శిక్షణ తీసుకుంటోందని, ప్రస్తుతం సింధు మంచి ఫాంలో ఉందని, సింధు విజయం కోసం కోచ్ గోపిచంద్ కసితో పని చేస్తున్నారని, విజయం మన దేశం తరపునే ఉంటుందని, మనదేశానికి సింధు బంగారు పతకం సాధిస్తుందన్నారు. క్లిష్టపరిస్థితుల్లోనూ మ్యాచ్ను తిప్పగలిగే సత్తా సింధుకు ఉందన్నారు. అకాడమీలో గోపిచంద్ ఫ్యామిలితో కలిసి మ్యాచ్ చూస్తామన్నారు.