హైదరాబాద్: రియో ఒలంపిక్ ఛాంపియన్, స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ లేకపోయినా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గడం అంత సులువు కాదని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అభిప్రాయపడ్డారు. గురువారం ముంబైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చిన పీవీ సింధు మీడియాతో మాట్లాడారు.
3వ వన్డేలో భారత్ ఓటమి: సిరిస్ 2-1తో నెగ్గిన మిథాలీ సేన
"ముందు జాతీయ ఛాంపియన్షిప్ ఉంది. ఆ తర్వాత ఆల్ ఇంగ్లాండ్. అతిపెద్ద టోర్నీల్లో అదొకటి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నా. నూటికి నూరు శాతం కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈ ఏడాది మరికొన్ని సూపర్ సిరిస్లు కూడా ఉన్నాయి. అనంతరం ఒలింపిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వీటన్నంటికి ఫిట్గా ఉండాలి" అని సింధు అన్నారు.
ఈ ఏడాది జరిగే అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్కు మారిన్ దూరం కావడంతో భారత షట్లర్లు సింధు, సైనాలకు ఓ సువర్ణావకాశమని ఇటీవలే కోచ్ విమల్ కుమార్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సింధు మాట్లాడుతూ "దురదృష్టవశాత్తు మారిన్ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. గాయాలు క్రీడల్లో భాగం. మారీన్ లేనంత మాత్రాన ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలవడం సులువని అనుకోను" అని అన్నారు.
"తొలి 10 నుంచి 15 ర్యాంకుల్లో ఉన్న క్రీడాకారిణుల ఆట సమానం. ఒకరు లేకపోతే టైటిల్ గెలువొచ్చని భావించలేం. ఆల్ ఇంగ్లాండ్లో ప్రతి మ్యాచ్ కీలకం. చెన్ యుఫెయ్, బింగ్జియావొ (చైనా), సుంగ్ హ్యున్ (కొరియా), రచనోక్ (థాయ్లాండ్) బాగా ఆడుతున్నారు" అని పీవీ సింధు చెప్పుకొచ్చారు. మార్చి 6న ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ప్రారంభం కానుంది.