హైదరాబాద్: కౌలలాంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 18-21, 19-21 తేడాతో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఓపెనింగ్ గేమ్లో ఒకానొక దశలో 16-11 ఆధిక్యంలో ఉన్న కిదాంబి శ్రీకాంత్ ఒత్తిడిని అధిగమించలేక పోయాడు. ఆ తర్ావత అనూహ్యాంగా పుంజుకున్న చెన్ లాంగ్ తొలి గేమ్ను 18-21తో సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో గేమ్లో ఆరంభం నుంచే చెన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.
ఒకానొక దశలో 8-16పాయింట్ల తేడాతో ఉన్న కిదాంబి శ్రీకాంత్ వరుస షాట్లతో చెలరేగడంతో 18-18తో సమం చేశాడు. అయితే, చివర్లో పుంజుకున్న చెన్ లాంగ్ 19-21తేడాతో రెండో గేమ్ను గెలవడంతో పాటు మ్యాచ్ని కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ ఓటమితో మలేసియా ఓపెన్లో భారత షట్లర్ల కథ ముగిసింది.
మహిళల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-11, 21-15తో కొసిత్ పెట్ప్రదబ్ (థాయ్లాండ్)ను ఓడించి క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు.