హైదరాబాద్: ఒలింపిక్స్ కన్నా జీవితమే ముఖ్యమని భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అభిప్రాయపడింది. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా వేయడాన్ని సింధు పూర్తిగా సమర్థించింది. ఒలింపిక్స్లో పోటీ పడడం అథ్లెట్లందరికీ కల, కానీ.. జీవితమే అన్నికంటే ప్రథమమని శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఇటీవల బర్మింగ్హామ్లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2020లో పాల్గొన్న సింధు ప్రస్తుతం తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంది.
ఇక ధోనీ కెరీర్ ముగిసినట్లే: హర్షా భోగ్లే
'ఒలింపిక్స్ను వాయిదా వేయడం మంచి నిర్ణయం. ఎందుకంటే.. ఇప్పుడు మనకు మరో అవకాశం లేదు. కరోనా కారణంగా కొందరు ప్రజలు చనిపోతున్నారు. జీవితమే ప్రథమం. టోర్నీలను సైతం రద్దు చేస్తుండడం మంచి విషయం. ప్రతి వారం, ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయని నాకు కొందరు నిరాశగా చెబుతున్నారు. అయితే జీవితమే తొలి ప్రాధాన్యం.. ఆ తర్వాతే ఒలింపిక్స్' అని సింధు అంది. 12 రోజులు తన గది నుంచి బయటకు రాలేదని సింధు చెప్పింది.
కరోనా నివారణ చర్యల కోసం వివిధ రంగాల ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు కూడా ముందుకు వచ్చింది. 'కొవిడ్-19ను దీటుగా ఎదుర్కొనేందుకు నా వంతు సహాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నా' అని ట్విటర్లో వెల్లడించింది.
అంతకుముందు హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా విసిరిన 'సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్'ను సింధు స్వీకరించిన విషయం తెలిసిందే. చాలెంజ్లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సింధు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాదాపు 30 సెకండ్లు సింధు చేతులు శుభ్రం చేసుకుంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు మనం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరు తమ చేతులను శుభ్రపరుచుకోవాలంది. ఇక కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు ఈ చాలెంజ్ను స్వీకరించాలని కోరింది.