స్వర్ణ సమరం సాగిందిలా:
ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరోసీడ్ సేన్ 21-19, 21-18తో టాప్సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ కులావత్ వితిసన్ (థాయ్లాండ్)ను ఓడించాడు. తొలి గేమ్ ఆరంభంలో వితిసన్ ఎదురుదాడి చేస్తూ పాయింట్లు సాధించగా.. లక్ష్య వెంటనే పుంజుకున్నాడు. రెండో గేమ్ కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది. కీలక సమయంలో పాయింట్ గెలిచి 18-17తో ఆధిక్యంలోకి వెళ్లిన అతను ఆపై వరుస పాయింట్లతో గేమ్తో పాటు మ్యాచ్ను గెలిచి చరిత్ర సృష్టించాడు.
బాయ్ నజరానా రూ.10 లక్షలు
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్కు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. ‘‘లక్ష్యసేన్ దేశం గర్వించే ప్రదర్శన చేశాడు. యువ షట్లర్లను ప్రోత్సహిస్తున్నందుకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది. అతని ప్రదర్శన మిగిలిన క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది'' అని సంఘం కార్యదర్శి అజయ్ సింఘానియా చెప్పాడు.
పి.వి.సింధు (2012) తర్వాత ఘనత లక్ష్యసేన్దే:
గౌతమ్ థక్కర్ (1965), పి.వి.సింధు (2012) తర్వాత ఆసియా జూనియర్ టైటిల్ సాధించిన ఘనత లక్ష్యసేన్దే. 2011లో సింధు కాంస్యం కూడా గెలవగా.. సమీర్వర్మ 2011లో రజతం, 2012లో కాంస్యం సాధించాడు. 2009లో ప్రణవ్ చోప్రా-ప్రజక్త సావంత్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం నెగ్గారు.
అతనితో ఆడాలన్న కల నెరవేరింది
ఈ స్వర్ణం ఎంతో అమూల్యం. నా విశ్వాసాన్ని పెంచిన విజయమిది. మోకాలికి గాయంతో టోర్నీలో ఇబ్బంది పడ్డాను. నొప్పి తాళలేక మందులు వాడుతూ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. భారత్కు రాగానే కోచ్తో నా శిక్షణ గురించి చర్చించి.. దేహాన్ని దృఢంగా ఉంచుకోవడంపై దృష్టిసారిస్తా. సీనియర్ సర్క్యూట్లో రాణించాలంటే ఫిట్నెస్ ఎంతో అవసరం. న్యూజిలాండ్ ఓపెన్, థామస్ కప్ ఫైనల్ టోర్నీల్లో లిన్డాన్తో తలపడడం ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. అతనితో ఆడాలన్న నా కల నెరవేరింది.