టోక్యో: జపాన్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 22-20, 21-19 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్ లోకీన్ యూ(సింగపూర్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. 44 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించాడు. సింగపూర్ ప్లేయర్ నుంచి ప్రతి ఘటన ఎదురైనా చాకచక్యంగా ఆడి విజయం సాధించాడు.
తొలి రౌండ్ లో మలేషియా కు చెందిన అంగుస్ ను ఓడించిన ప్రణయ్.. అదే జోరును ప్రిక్వార్టర్స్ లోనూ కొనసాగించాడు. రెండు రౌండ్లలోనూ కీన్ యూ తీవ్ర పోటీనిచ్చాడు. అయినా ఏకాగ్రత కోల్పోకుండా ఆడిన ప్రణయ్.. విజయం దక్కించుకున్నాడు. కీన్ యూ పై గత నాలుగు మ్యాచ్ లలో ప్రణయ్ కు ఇది మూడో గెలుపు కావడం గమనార్హం. ప్రణయ్ తదుపరి రౌండ్లో తైపీ షట్లర్ చౌ టెన్ చెన్ను ఢీకొట్టాల్సి ఉంది.
ఇక మరో ప్రి క్వార్టర్స్ పోరులో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అతనికి లోకల్ ప్లేయర్ షాకిచ్చాడు. మాజీ వరల్డ్ నెంబర్ వన్ అయిన శ్రీకాంత్ 10-21, 16-21 తేడాతో అన్సీడెడ్ ప్లేయర్ కంట త్సునెయమ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక బుధవారం ముగిసిన తొలి రౌండ్ లో కిదాంబి శ్రీకాంత్.. జపాన్ కే చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో ఓడించాడు.
ఇటీవలే ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్-2022లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న శ్రీకాంత్.. జపాన్ ఓపెన్ తొలిరౌండ్ లో మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడాడు. లీ జి జియా తో పోరాడి గెలిచాడు. కానీ రెండో రౌండ్ లో మాత్రం ఆ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కంట త్సునెయమ చేతిలో 21-10, 21-16 తేడాతో దారుణ ఓటమి చవిచూశాడు. కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ప్రత్యర్థికి విజయాన్ని అందించి ఇంటిబాట పట్టాడు.
ఇదిలాఉండగా ఈ టోర్నీలో ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్ లో అర్జున్-కపిల ల ద్వయం, మహిళల డబుల్స్ లో జాలీ-గాయత్రి గోపీచంద్ ల జోడీ, మిక్స్డ్ డబుల్స్ లో ప్రసాద్ - దేవాంగన్ ల జంట తొలి రౌండ్ లోనే ఓడి నిరాశపరిచింది. గాయం కారణంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.