ముంబై: భారత దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ నందు నటేకర్ బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 88. వయసు రిత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో పుణెలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నందు నటేకర్ గౌరవ్ తెలిపారు. అతనికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నందు నటేకర్ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాటు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నందు నటేకర్ మృతి పట్ల సోషల్ మీడియాలో అందరూ సంతాపం ప్రకటిస్తున్నారు.
'నాన్న ఈరోజు ఉదయం ఇంట్లోనే కన్నుమూశారు. ఆ సమయంలో మేమంతా ఆయనతోనే ఉన్నాము. గత మూడు నెలలుగా నాన్న అరోగ్యం బాలేదు. చాలా బాధగా ఉంది. నాన్న ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా' అని నందు నటేకర్ కొడుకు గౌరవ్ ఓ జాతీయ మీడియాతో అన్నారు. గౌరవ్ కూడా క్రీడాకారుడే. భారతదేశ టెన్నిస్ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. గౌరవ్ 1994లో హిరోషిమా ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించారు. ప్రస్తుతం టోక్యో 2020లో ఆడుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా నందు నటేకర్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది.
గోల్డ్ మెడల్ గెలిచిన ఆనందంలో నోరు జారిన స్విమ్మర్.. వెంటనే నాలుక కరుచుకొని!! (వీడియో)
1950-60 మధ్య కాలంలో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నుంచి నందు నటేకర్ 'సూపర్ స్టార్'గా వెలుగొందారు. తన ఆటతో ప్రపంచ నెంబర్ 3గా కొంతకాలం కొనసాగారు. నటేకర్ బరిలోకి దిగితే కోర్టులో వీరోచితంగా పోరాడి విజయాలు సాధించేవారు. బ్యాడ్మింటన్లో 1956లోనే ఇంటర్నేషనల్ టైటిల్ కొట్టిన నందు నటేకర్.. అప్పట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డ్ నెలకొల్పారు. తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో దాదాపు 100 జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ అందుకున్నారు.
మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించిన నందు నటేకర్.. 1954లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్స్లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ వెళ్లారు. 1956లో మలేషియా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్లో విజేతగా నిలిచిన ఆయన.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డుల్లోకి ఎక్కారు.
1951 నుంచి 1963 వరకూ థామస్ కప్లో అంచనాలకి మించి రాణించిన నందు.. 16 సింగిల్స్ మ్యాచ్లకిగానూ 12 మ్యాచ్ల్లో విజయాలు అందుకున్నారు. 16 డబుల్స్ మ్యాచ్లకిగానూ ఎనమిదింటిలో టీమ్ని గెలిపించారు. జమైకా వేదికగా 1965లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లోనూ ఆయన భారత్కి ప్రాతినిథ్యం వహించారు. బ్యాడ్మింటన్లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రదానం చేసింది.