హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 'ఇండియా ఓపెన్' ఫైనల్లో నిరాశపరిచాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో మాజీ చాంపియన్ శ్రీకాంత్ 7-21, 20-22తో డెన్మార్క్కు చెందిన రెండో సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత మళ్లీ శ్రీ టైటిల్ పోరుకు చేరుకోవడం ఇదే మొదటిసారి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
36 నిమిషాల పోరాటంలో పాయింట్ల కోసం ఇరువురు క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. తొలి గేమ్లో లెక్కలేనన్ని అనవసర తప్పిదాలు చేయడంతో పాటు ప్రత్యర్థి జోరుకు తలవంచాడు. కానీ 11వ పాయింట్ వద్ద శ్రీకాంత్ అనవసర తప్పిదం చేయడంలో అక్సల్సెన్ ముందంజ వేశాడు. ఈ గేమ్లో రిటర్న్, బ్యాక్హ్యాండ్ షాట్లు నేర్పుగా ఆడటంలో శ్రీకాంత్ విఫలమయ్యాడు.
దీనిని ఆసరాగా చేసుకున్న అక్సల్సెన్ వరుస పాయింట్లతో తొలి గేమ్ను చేజిక్కించుకున్నాడు. అయితే రెండో గేమ్లో మాత్రం శ్రీకాంత్ పుంజుకున్నాడు. ఒక దశలో ఆరంభంలో 1-5తో వెనుకబడినా... తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి టచ్లోకి వచ్చాడు. దీనికితోడు లైన్ కాల్స్లోనూ శ్రీకాంత్ తప్పిదాలు ప్రతికూలంగా మారాయి.
ఈ దశలో పోరాటస్ఫూర్తిని చూపెట్టిన శ్రీకాంత్ 12-12తో స్కోరును సమం చేసి ఆశలు రేకెత్తించాడు. అక్సల్సెన్ కొట్టిన స్మాష్ వైడ్గా వెళ్లడంతో ఆధిక్యం 14-13కు పెరిగింది. స్మాష్లతో మరో రెండు పాయింట్లు సాధించాడు. అయితే రిటర్న్ షాట్లను నేర్పుగా ఆడగలిగే అక్సెల్సన్ మరో గేమ్దాకా పొడిగించకుండానే వరుస పాయింట్లతో గేమ్ను, మ్యాచ్ను ముగించాడు.
మ్యాచ్ అనంతరం కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ "కొంచెం భిన్నంగా ప్రయత్నించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. 'తొలి సెట్లో చిన్న తప్పిదాలతో విక్టర్కి నేనే ఎక్కువ అవకాశాలిచ్చేశాను. కానీ.. రెండో సెట్లో వాటిని దిద్దుకునేందుకు ప్రయత్నించా. దాంతో 20 పాయింట్లు సాధించే వరకూ గేమ్ నా కంట్రోలోనే ఉంది" అని అన్నాడు.
"అయితే.. అతను కొన్ని సాహసోపేత షాట్లతో మ్యాచ్ను లాగేసుకున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో నేను ఏమీ భిన్నంగా ప్రయత్నించలేదు. నా ఓటమికి అది కూడా ఓ కారణం కావచ్చు. కొంచెం భిన్నంగా ఆడి ఉంటే బాగుండేదేమో?" అని శ్రీకాంత్ వెల్లడించాడు.