
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) 3వ సీజన్లో అరంగేట్రం చేసిన అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ జట్టు సెమీస్కు చేరింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో అహ్మదాబాద్ 5-0తో ముంబై రాకెట్స్పై ఘన విజయం సాధించింది.
తొలి మ్యాచ్లో భాగంగా మిక్స్డ్ డబుల్స్లో లా చెక్ హిమ్-కమిల్లా రైటర్ (అహ్మదాబాద్) జోడి 15-11, 15-7తో లీ యంగ్ డే-స్టోయెవా జంటపై విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్లో ప్రణయ్ (అహ్మదాబాద్) 15-12, 15-12తో సన్ వాన్ హోపై నెగ్గాడు.
ఇక, మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (అహ్మదాబాద్) 15-9, 15-12తో బీవెన్ జాంగ్పై విజయం సాధించింది. రెండో పురుషుల సింగిల్స్ ఇరు జట్లకు 'ట్రంప్' మ్యాచ్ కాగా... ఇందులో సౌరభ్ వర్మ (అహ్మదాబాద్) 15-14, 15-11తో సోదరుడు సమీర్ వర్మపై విజయం సాధించాడు.
చివరగా జరిగిన పురుషుల డబుల్స్లో రెగినాల్డ్-నందగోపాల్ (అహ్మదాబాద్) జోడీ 10-15 12-15తో లీ యంగ్ డే-బూన్ హియాంగ్ తన్ జంట చేతిలో ఓటమిపాలైంది. అయితే ఐదు మ్యాచ్లాడిన అహ్మదాబాద్ మూడు విజయాలు సాధించి 17 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.
తాజా ఓటమితో నిర్ణీత ఐదు లీగ్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న ముంబై రాకెట్స్తోపాటు పీవీ సింధు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్ (12 పాయింట్లు) లీగ్ దశలోనే నిష్క్రమించాయి. బెంగళూరు, హైదరాబాద్ 15, 14 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
5 మ్యాచ్లూ ఆడేసిన అవధ్, చెన్నై చెరో 12 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, నార్త్ ఈస్టర్న్ చెరో 11 పాయింట్లతో 6, 7 స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే పీబీఎల్ మూడో సీజన్ చివరి అంచె పోటీలు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం నుంచి జరగనున్నాయి.
బుధవారం ఇక్కడ జరిగే మ్యాచ్లో ఢిల్లీ డాషర్స్తో నార్త్ఈస్టర్న్ వారియర్స్ పోటీపడనుండగా.. గురువారం జరిగే చివరి లీగ్లో బెంగళూరు బ్లాస్టర్స్ను ఆతిథ్య హైదరాబాద్ ఎదుర్కోనుంది. 12, 13వ తేదీల్లో సెమీస్, 14న జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.