
హైదరాబాద్: జకార్తా వేదికగా జరుగుతోన్న ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-15, 9-21, 21-14 తేడాతో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ లిన్ డాన్(చైనా)పై విజయం సాధించాడు.
ఎనిమిదవ సీడ్గా బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్ 59 నిమిషాల పోరులో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. మొదటి గేమ్ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్లో భారీ తేడాతో ఓడాడు. ఆ తర్వాత జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రణయ్ అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.
లిన్ డాన్పై ప్రణయ్కు ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ మూడుసార్లు తలపడితే రెండు సార్లు ప్రణయ్నే విజయం వరించింది. మూడు సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ తలపడటం ఇదే మొదటిసారి. ఇక, రెండో రౌండ్లో ప్రణయ్... వాంగ్ జు వియ్(చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు.
ప్రణయ్-వాంగ్ జు వియ్ 2-2 రికార్డుతో సమంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ షిప్స్లో వాంగ్ జు వియ్పై ప్రణయ్ విజయం సాధించాడు. మరోవైపు భారత్కు చెందిన సమీర్ వర్మ 21-9, 12-21, 22-20 తేడాతో ధనిష్ రస్మస్పై విజయం సాధించి రెండో రౌండ్కు అర్హత సాధించాడు.