హైదరాబాద్: సమస్యలపై స్పందించడంలో ముందుండే జ్వాల గుత్తా మరోసారి బెజవాడలో మెరిశారు. ఆదివారం గేట్ వే హోటల్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని యువత చిన్నారులనుద్దేశించి ప్రసంగించారు. నేటి తరానికి నైతిక విలువలు నేర్పించాలని జ్వాలా సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. డిజిటల్ చదువులతో పాటు, ఆటలు కూడా ముఖ్యమేనని తెలిపారు.
ప్రపంచ ఛాంపియన్ అయ్యేందుకు అవకాశాలు కేవలం క్రీడల్లోనే ఉన్నాయని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, కోచ్ గుత్తా జ్వాల అన్నారు. మరే ఇతర రంగంలోనూ ఇలాంటి అవకాశాలు ఉండవని ఆమె పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్టౌన్ ఆధ్వర్యంలో 2017-18 సంవత్సరానికి సంబంధించి ఒకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైయ్యారు.
ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సైంట్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ అధ్యక్షుడు బి. అశోక్రెడ్డిలకు ఎక్స్లెన్స్ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాల మాట్లాడుతూ నైతిక విలువలను మర్చిపోతున్నామని గుర్తు చేశారు. వాటిని నేటి తరానికి నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తల్లిదండ్రులు ఇంజినీరింగ్, మెడిసిన్ లాగానే క్రీడలను ప్రొఫెషనల్గా చూడాలని పిలుపునిచ్చారు.
మరో అవార్డు గ్రహీత బి. అశోక్రెడ్డి మాట్లాడుతూ టీమ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. జీవితంలో విలువలు చాలా ముఖ్యమన్నారు. డిజిటల్ చదువులతో పాటు, ఆటలు కూడా ముఖ్యమేనన్నారు. శాప్ చైర్మన్ పి. అంకమ్మ చౌదరి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహిస్తే ఆరోగ్యంతో పాటు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. రోటరీ డిస్ట్రిక్ గవర్నర్ జీవీ రామారావు, మిడ్టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్ల పార్థసారధి, సతీష్చంద్ర, యడవల్లి, ఒకేషనల్ సర్వీస్ ఉపాధ్యక్షుడు తొండెపు రత్నశ్రీనివాస్ పాల్గొన్నారు.