హైదరాబాద్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో కొత్త సర్వీస్ నిబంధన రాబోతుందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో సర్వీస్ జడ్జీల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై సర్వీస్ నిబంధన కఠినంగా అమలు చేయడంపై ది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఇందులో భాగంగా సర్వీస్ చేసిన సమయంలో షటిల్.. కోర్టుకు 1.15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే దానిని ఫాల్ట్గా ప్రకటించే విధంగా నిబంధనను సవరించనున్నారు. ఈ మేరకు జమైకాలోని మోంటిగో బేలో సమావేశమైన బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు 2018లో జరిగే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అన్ని గ్రేడ్ 1 ఈవెంట్స్తో పాటు (బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ తప్పించి), గ్రేడ్ 2 ఈవెంట్స్కు కూడా ఈ నిబంధన అమలవుతుందని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.
వచ్చే ఏడాది చివరి వరకు ఈ ప్రయోగం కొనసాగుతుందని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనపై భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ స్పందించారు. 'సర్వీస్ విషయంలో ఎప్పుడూ గందరగోళమే. పది టోర్నీల్లో ఒకరిద్దరు అంపైర్లు ఆటగాళ్ల సర్వీస్ను తప్పు పడతారు. సర్వీస్ తప్పు అయితే అది ఆటగాళ్లకే తెలిసిపోవాలి' అని అన్నాడు.
'దురదృష్టవశాత్తు సర్వీస్ నిబంధన ఎప్పుడూ అనుమానంగానే ఉంటుంది. కొందరు అంపైర్లు ఫాల్ట్గా ప్రకటిస్తారు. మరికొందరు ప్రకటించరు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కావాలి. బ్యాడ్మింటన్లో సర్వీస్ ముఖ్యభూమిక పోషిస్తుంది. సర్వీస్ తప్పుగా చేస్తుంటే అంపైర్లు నిలకడగా ఫాల్ట్లు ప్రకటించాలి' అని గోపీచంద్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.