
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమితి మరోసారి క్రీడాకారులతో పాటు కోచ్ను సైతం నిరాశకు గురి చేసింది. దీంతో సదరు సమితి మంగళవారం విడుదల చేసిన ప్రతిపాదిత కొత్త నిబంధనలపై భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అసహనం వ్యక్తం చేశాడు.
స్కోరింగ్ పద్ధతిని మార్చే యోచనలో ఉన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్).. మ్యాచ్ సందర్భంగా కోర్టులో కోచింగ్ సమయాన్ని తగ్గించాలని భావిస్తోంది. మేలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో వీటిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
కోచింగ్ సమయం తగ్గించడంలో తర్కమేంటో తనకు అర్థం కావడం లేదన్నాడు గోపీచంద్. ''అసలు ఎలాంటి మార్పులు చేస్తున్నారన్నదానిపై పూర్తి అవగాహన లేదు. ముసాయిదాను ఇంకా చూడలేదు. ఒకప్పుడు మ్యాచ్ల మధ్యలో షట్లర్లకు కోచింగ్ ఇచ్చే అవకాశం ఉండేది కాదు. ప్రపంచ సమాఖ్య ఆ అవకాశం కల్పించింది. ఇప్పుడు కోచింగ్ సమయాన్ని తగ్గించాలని భావిస్తోంది. అందులో తర్కమేంటో నాకు అర్థం కావడం లేదు'' అని చెప్పాడు.
మరోవైపు డెన్మార్క్ చీఫ్ కోచ్ బీడబ్ల్యూఎఫ్ తీరును తప్పుపట్టాడు. ''అన్ని క్రీడల్లో బ్యాడ్మింటన్ను ప్రత్యేకంగా నిలిపేది కోర్టులో కోచింగే. టీవీలో ప్రేక్షకులను ఇది ఆకట్టుకునే అంశం'' అని కెన్నెత్ జొనాసెన్ అన్నాడు. ఐతే వీరిద్దరికి భిన్నంగా భారత కోచ్లు విమల్ కుమార్, మహ్మద్ ఆరిఫ్ స్పందించారు. ''కొత్త నిబంధన షట్లర్లను మానసికంగా, శారీరకంగా పరీక్షిస్తుంది. కఠిన సందర్భాల్లో వాళ్లు కోచ్లపై ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుంది'' అని విమల్ అన్నాడు.
ఈ మధ్య కాలంలో షట్లర్లు ఎక్కువగా సాంకేతికత, కోచ్లపై ఆధారపడుతున్నారని, వాళ్లు వారి బుర్రలను వాడటం చాలా ముఖ్యమని ఆరిఫ్ చెప్పాడు. ప్రస్తుతం గేమ్ అర్థభాగం (11 పాయింట్ల), ఆ తర్వాత గేమ్ ముగిసిన తర్వాత షట్లర్లు, కోచ్లతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ కొత్త ప్రతిపాదనలను మార్చి 30 నుంచి కొత్త నియమాలను ప్రకటించనుంది. దీని నిమిత్తం మే19న బ్యాంకాంక్ వేదికగా సమావేశం నిర్వహించనుంది.