స్వర్ణం గెలవడం పట్ల అమితానందంగా
‘కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలవడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తోంది. అందులోనూ మలేసియా లాంటి బలమైన జట్టును ఓడించి విజేతలుగా నిలవడం గొప్పగా ఉంది. ఈ విజయంలో మిక్స్డ్ డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప-సాత్విక్ సాయిరాజ్లది కీలక పాత్ర. వారి గురించి ఎంత పొగిడినా తక్కువే. వాళ్లు అద్భుత విజయంతో మంచి ఆరంభం ఇచ్చారు' అని వివరించాడు.
ఊహకే అందేది కాదు
'శ్రీకాంత్, సైనా మిగిలిన పని చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు టీమ్ ఈవెంట్లలో మలేసియాను ఓడించడం ఊహకే అందేది కాదు. భారత బ్యాడ్మింటన్ లోతు పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. లీ చాంగ్ వీపై ఒత్తిడి పెంచి శ్రీకాంత్ విజయం సాధించాడు' అని గోపీచంద్ అన్నాడు.
కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ:
‘లీ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో లేడన్న మాట వాస్తవమే. కానీ అతని లాంటి మేటి ఆటగాడిపై విజయం ఆషామాషీ కాదు. రక్షణాత్మకంగా ఆడుతూనే దాడి చేయాల్సి ఉంటుంది. అత్యుత్తమంగా ఆడటానికి ప్రయత్నించా. అయితే విజయం ఇంత సులభంగా లభిస్తుందని అనుకోలేదు'' అని కిదాంబి శ్రీకాంత్ అన్నాడు.
సైనా మాట్లాడుతూ:
‘‘కెరీర్లోనే గుర్తుంచుకోదగ్గ విజయమిది. ఒక దశలో నీరసపడ్డాను. మ్యాచ్పై దృష్టి కేంద్రీకరించలేకపోయాను. కానీ ఎలాగోలా తిరిగి పుంజుకున్నా. పాయింట్ గెలిచి భారత్కు స్వర్ణం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన గెలుపు. ఎందుకంటే ఇది జట్టుగా సాధించిన విజయం'' అని సైనా చెప్పింది.