
హైదరాబాద్: చైనా ఓపెన్లో ఇంతవరకూ పతకం లేని లోటును తప్పక తీరుస్తుందని భావించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకి మరోమారు భంగపాటుకు గురైంది. టోర్నీలో భాగంగా చైనాకు చెందిన చెన్ యూఫీతో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21-11, 11-21, 15-21 తేడాతో సింధు ఓటమిపాలైంది.
ఈ ఓటమితో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి సింధు నిష్క్రమించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో అన్యూహ్యంగా వెనుదిరిగినా, క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు పతకంపై ఆశలు రేపింది. తొలి గేమ్ను 21-11 తేడాతో గెలుపొందిన సింధు.. తర్వాత వరుసగా రెండు గేముల్లో ఓటమిపాలై నిరాశపర్చింది.
దాదాపు గంట పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు బాగానే పోరాడినప్పటికీ చెన్ యూఫీ చేతిలో ఓటమిపాలుకాక తప్పలేదు. ఆట ఆరంభం నుంచి సింధుపై చెన్ ఎదురు దాడికి దిగింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న సింధు వరుసగా ఆరు పాయింట్లు సాధించి 21-11 తేడాతో తొలి గేమ్ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత వరుసగా రెండు గేమ్లను 11-21, 15-21 తేడాతో గెలుచుకొని సింధును ఓడించింది. ఈ పోరులో చెన్ యూఫీ.. సింధుపై ఆధిపత్యం చెలాయించింది. అంతకు ముందు జరిగిన పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 21-9, 21-11 తేడాతో జపనీస్ షట్లర్, వరల్డ్ ఛాంపియన్ కెంటో మొమొటా చేతిలో ఓడిపోయాడు.
మరో స్టార్ ప్లేయర్ ప్రణయ్ మాత్రం తొలిరౌండ్లో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు. హాంకాంగ్ ప్లేయర్ కా లాంగ్ ఆంగస్తో పోటీ పడిన ప్రణయ్ 16-21, 12-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. తాజాగా, ఇప్పుడు సింధు ఓటమితో చైనా ఓపెన్లో భారత పోరాటం ముగిసింది. చైనా ఓపెన్లో ఇంతవరకూ ఏ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా పతకం సాధించకపోవడం విశేషం.