టోక్యో: ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగించగా.. సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్లు కూడా విజయాలందుకొని రెండో రౌడ్లోకి ప్రవేశించారు. సాయి ప్రణీత్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్యసేన్ 21-12, 21-11 తేడాతో వరల్డ్ 19వ ర్యాంకర్ హాన్స్ క్రిస్టియన్ విట్టింగస్ను ఓడించాడు. రెండు గేమ్ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన లక్ష్యసేన్ అలవోక విజయాన్నందుకున్నాడు.
గత వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్యం గెలిచిన లక్ష్యసేన్.. ఈ సారి బంగారు పతకంతో రావాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. ఇటీవల అతను మెరుగ్గా రాణిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో మ్యాచ్లో శ్రీకాంత్ 22-20, 21-19 తేడాతో ఐరీష్ ప్లేయర్ ఎన్ గుయెన్ను ఓడించాడు. బుధవారం జరిగే రెండో రౌండ్లో చైనాకు చెందిన జేపీ జావోతో తలపడుతాడు.
ఇక హెచ్ఎస్ ప్రణయ్ 21-12, 21-11 తేడాతో ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్ వ్రాబర్పై గెలుపొందాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, తైవాన్ ప్లేయర్ టీసీ చౌ చేతిలో 21-15, 15-21, 21-15 తేడాతో సాయి ప్రణీత్ పోరాడి ఓడాడు.
డబుల్స్లోనూ భారత జట్టుకి మిశ్రమ ఫలితాలే వచ్చాయి. వుమెన్స్ డబుల్స్లో భారత జోడి అశ్విని పొన్నప్ప-సిక్కీ రెడ్డి తొలి రౌండ్లో విజయం సాధించి, రౌండ్ 32కి అర్హత సాధించారు. అలాగే మిక్స్డ్ డబుల్స్లోనూ భారత జోడికి శుభారంభమే దక్కింది...
ఇషాన్ భత్నగర్- తనీశా క్రాస్టో తొలి రౌండ్లో గెలిచి రౌండ్ 32కి అర్హత సాధించగా మెన్స్ డబుల్స్లో మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. మను అట్రీ- సుమీత్ రెడ్డి మొదటి మ్యాచ్లో ఓడి తొలి రౌండ్ నుంచే ఇంటిదారి పట్టారు...
మరో జోడి అర్జున్ - ద్రువ్ కపిల తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. వరల్డ్ 33 తైపాయ్ జోడీతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో 21-17, 17-21, 22-20 తేడాతో పోరాడి గెలిచింది అర్జున్- ద్రువ్ జోడి. తర్వాతి రౌండ్లో వరల్డ్ నెం.8 ర్యాంకర్స్ కిమ్ అస్ర్టప్ - అండర్స్ రస్ముసేన్లతో తలబడునున్నారు అర్జున్, ద్రువ్..