
హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21-13, 13-21, 21-18తో నిచాన్ జిందాపోల్ (థాయ్లాండ్)పై కష్టపడి గెలిచింది. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో థాయ్ అమ్మాయి తీవ్ర ప్రతిఘటనను చూపెట్టింది.
ముఖాముఖి రికార్డులో 2-1తో ఉన్న సింధు.. ప్రత్యర్థి కొట్టిన ప్రతి షాట్కు దీటైన సమాధానం చెప్పింది. వరుసగా ఆరు పాయింట్లతో తొలి గేమ్ను మొదలుపెట్టిన తెలుగమ్మాయి ఒక్కసారిగా 7-3 ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే బ్యాక్హ్యాండ్ ర్యాలీలతో ఆధిక్యాన్ని 15-7కు పెంచుకుంది. ఈ దశలో థాయ్ ప్లేయర్ కొట్టిన చాలా షాట్లు నెట్కు తాకడంతో సింధు 20-13కు చేరుకుని అలవోకగా గేమ్ను చేజిక్కించుకుంది. రెండో గేమ్లో అటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన జిందాపోల్.. 7-3 ఆధిక్యంలోకి వెళ్లింది.
బ్యాక్హ్యాండ్ రిటర్న్ల్లో ఇబ్బందులు ఎదుర్కొవడం సింధు ఆటను దెబ్బతీసింది. ర్యాలీలతో దుమ్మురేపిన థాయ్ ప్లేయర్ 11-3కు వెళ్లినా.. పట్టువదలకుండా పోరాడిన సింధు ఆధిక్యాన్ని 10-14కు తగ్గించింది. అయితే అప్పటికే కాస్త అలసిపోయిన సింధు జడ్జిమెంట్ తప్పిదాలతో 13-17తో వెనుకబడింది. ఈ దశలో థాయ్ అమ్మాయి వరుసగా 3 పాయింట్లు నెగ్గి మ్యాచ్లో నిలిచింది.
నిర్ణయాత్మక మూడో గేమ్లో ఇరువురు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. జిందాపోల్ కొట్టిన బ్యాక్హ్యాండ్ షాట్లను తీయడంలో ఇబ్బందిపడ్డ సింధు.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో సఫలమైంది. ఫలితంగా 3-0తో మొదలైన సింధు ఆధిక్యం.. 8-7కు పెరిగింది. ఓవైపు కోచ్ గోపీచంద్ సలహాలు స్వీకరిస్తూనే సింధు రిటర్న్ షాట్లలో మరింత పరిణతి చూపెట్టింది.
ఫలితంగా 9-9తో ఉన్న స్కోరును 11-9, 15-12కి తీసుకెళ్లింది. ఈ దశలో జిందాపోల్ పుంజుకోవడం, సింధు కొట్టిన షాట్స్ నెట్కు తగలడంతో స్కోరు 16-16, 18-18తో సమమైంది. కానీ నెట్ వద్ద సూపర్ డ్రాప్స్తో మ్యాచ్ పాయింట్కు చేరువైన సింధుకు.. థాయ్ ప్లేయర్ కొట్టిన రిటర్న్ షాట్ లక్ష్యం చేరకపోవడంతో విజయం సొంతమైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 21-10, 21-19తో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు.
సింధు మాట్లాడుతూ..:
క్వార్టర్ఫైనల్కు తన ఆటతీరు మెరుగుపడాల్సి ఉంటుందని మ్యాచ్ అనంతరం సింధు చెప్పింది. 'నా ఆట ఇంకా మెరుగుపడాల్సి ఉంటుంది. క్లిష్టమైన రెండో రౌండ్ను గట్టెక్కినందుకు సంతోషంగా ఉంది. పూర్తి విశ్రాంతి తీసుకుని శుక్రవారం మ్యాచ్కు బాగా సన్నద్ధమవుతా' అని తెలిపింది.
సరిపెట్టుకున్న శ్రీకాంత్:
మూడోసీడ్ కిడాంబి శ్రీకాంత్కు ప్రీక్వార్టర్ ఫైనల్లో పరాజయం ఎదురైంది. చైనాకు చెందిన 42వ ర్యాంక్ ఆటగాడు హాంగ్ యు జియాంగ్తో పోటాపోటీగా జరిగిన రెండో రౌండ్లో శ్రీకాంత్ 11-21, 21-15, 20-22 స్కోరుతో కంగుతిన్నాడు. హాంగ్ క్వార్టర్ ఫైనల్లో భారత్కు చెందిన ప్రణయ్ను ఢీకొంటాడు.
చిరాగ్, సాత్విక్లు ఓడి:
పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి జోడీ 16-21, 21-16, 21-23 స్కోరుతో రెండోసీడ్ డెన్మార్క్ జోడీ బొ మథియాస్, మోగిన్సెన్ చేతిలో రెండో రౌండ్లో ఓటమితో టోర్నీ నుంచి వైదొలగింది.