హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల ఆరంభానికి ఇంకో పది రోజుల సమయమే ఉంది. కానీ ఇప్పటికీ ఈ క్రీడల్లో పాల్గొనే భారత ఆటగాళ్ల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 575 మంది అథ్లెట్లు, 213 మంది అధికారులతో భారత ఒలింపిక్ సంఘం ఇప్పటికే మంత్రిత్వ శాఖకు జాబితాను పంపించింది. కానీ ఈ జాబితాను ధ్రువీకరించడంలో జాప్యం జరుగుతోంది. క్రీడాకారులు ఆసియా క్రీడలకు వెళ్లాలంటే మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర తప్పనిసరి.
ఈ కామన్వెల్త్ క్రీడల కోసం ఇండొనేషియాకు వెళ్లే బృందానికి శనివారం క్రీడా మంత్రిత్వ శాఖ వీడ్కోలు విందు ఇవ్వనుంది. ఆ లోపు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఆగష్టు 18 నుంచి సెప్టెంబరు 2వ తేదీ మధ్య కాలంలో జరగనున్న ఈ పోటీలలో ఆసియా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొననున్నారు. కాగా, 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో నిందితుడైన రాజ్కుమార్ సచేటిని నలుగురు డిప్యూటీ చెఫ్ డి మిషన్ అధికారుల్లో ఒకరిగా ఎంపికచేయడంపై క్రీడాశాఖ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
ఆసియా గేమ్స్ ఓ ఖండానికే పరిమితమైనప్పటికీ ఈ గేమ్స్లో మొత్తం 45 దేశాలు పాల్గొంటాయి. దీంతో ఒలింపిక్స్ స్థాయి ఉన్న ఈవెంట్గా దీనిని పరిగణిస్తుంటారు. కామన్వెల్త్ క్రీడల్లో ఇంతకంటే ఎక్కువ (71) దేశాలు పాల్గొంటునప్పటికీ, క్రీడాంశాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఆసియా క్రీడల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం జరగబోయే ఆసియా గేమ్స్లో 45 దేశాలు పాల్గొననున్నాయి. మొత్తం 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరుగనున్నాయి.
ఈసారి పోటీలకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఇలా రెండు నగరాలు వేదికగా నిలవడం ఆసియా గేమ్స్ చరిత్రలో ఇదే తొలిసారి. ఒలింపిక్స్, కామన్వెల్త్ లాగా ఆసియా దేశాలకు ఓ క్రీడోత్సవం ఉండాలన్న ఆలోచన మొట్టమొదటి సారి జపాన్, ఫిలిప్పీన్స్, చైనా చొరవతో 1912లో అంకురార్పణ జరిగింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా తదుపరి ఏడాదే ఇది కార్యరూపం దాల్చింది.