
హైదరాబాద్: జపాన్ వేదికగా ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ 2020లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారత దేశంలో ఇప్పుడో పెద్ద స్టార్. దేశమంతా నీరజ్ చోప్రా పేరే మార్మోగిపోతోంది. యువతకు అతడు ఆదర్శప్రాయంగా మారాడు. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు అథ్లెటిక్స్లో ఒక్క పతకం కూడా సాధించని భారత్.. నీరజ్ పుణ్యమాని చరిత్రను తిరగరాసింది. నీరజ్ బరిసెను అల్లంత దూరానికి విసరి.. విశ్వ వేదికపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించాడు. ఫైనల్ పోరులో బరిసెను 87.58 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు.
జపాన్ నుంచి తిరిగివచ్చినప్పటినుంచి నీరజ్ చోప్రా పలు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అతడిని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఉత్సాహాం చూపుతోంది. ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ కూడా తాజాగా నీరజ్ను ఇంటర్వ్యూ చేసింది. పాపులర్ ఆర్జే మలిష్కా మెండోన్సా వీడియో కాల్ (జూమ్ యాప్) ద్వారా నీరజ్ను ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ కావడానికి ముందు ఆర్జే మలిష్కా తన తోటి ఉద్యోగులతో కలిసి ఓ పాత హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. 'ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ' సాంగ్కు ఆర్జే అమ్మాయిలు స్టెప్పులేశారు. నీరజ్ వీడియో కాల్ ద్వారా లైవ్లో ఉన్నప్పుడే వాళ్లంతా చిందేశారు. ఆపై నీరజ్కు ఆమె కొన్ని ప్రశ్నలు వేసింది.
ఆర్జే మలిష్కా తన ట్విట్టర్లో ఆ డ్యాన్స్కు చెందిన వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ ఘటన పట్ల ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫిమేల్ గెస్ట్తో ఓ మేల్ ఆర్జే ఇలాగే ప్రవర్తిస్తే దాన్ని లైంగిక వేధింపుగా ఆరోపిస్తారని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ఆర్జేలు తక్షణమే ఆ వీడియోను డిలీట్ చేయాలని ఇంకొకరు ట్వీటారు. 'దేశానికి పతకం తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది', 'మీ ప్రవర్తనతో తల దించుకునేలా చేశారు', 'అతనికి మీరిచ్చే గౌరవం ఇదేనా' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. నీరజ్ను అవమానపరిచినందుకు క్షమాపణలు చెప్పాలని కొందరన్నారు. ఆ టీమ్ను ఆ రేడియో స్టేషన్ తొలగించాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. నెట్టింట పలు మీమ్స్తో ఆర్జే టీమ్ను ట్రోల్ చేశారు. దీంతో ట్విట్టర్ ఇండియాలో మలిష్కా ట్రెండ్ అయ్యింది.
నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 7 పతకాలు కైవసం చేసుకుంది భారత్.
నీరజ్ చోప్రాది హర్యానాలోని పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామం. నీరజ్ చోప్రా తండ్రి రైతు. చిన్నప్పుడు నీరజ్కు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. కానీ 11 ఏళ్ల వయసు అప్పుడే జావెలిన్ మీద ఆసక్తి ఏర్పడింది. పానిపట్ స్టేడియంలో జైవీర్ అనే అథ్లెట్.. జావెలిన్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నీరజ్కు కూడా జావెలిన్ నేర్చుకోవాలనే కుతూహలం ఏర్పడింది. అలాజజ పంచ్కులలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్లో ఉండి జావెలిన్లో శిక్షణ తీసుకున్నాడు. అతడి తల్లి సరోజ్ గృహిణి. నీరజ్కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నీరజ్ చోప్రా 24 డిసెంబర్, 1997లో జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 23 ఏళ్లు.