
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు పరాజయాల బాటను వీడడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 22-42తో యూపీ యోధా చేతిలో ఓడిపోయింది. యూపీ రైడర్ శ్రీకాంత్ జాధవ్ 8 పాయింట్లతో రైడింగ్లో మెరవగా.. ట్యాక్లింగ్లో సమిత్ హైఫై (5 పాయింట్లు)సాధించాడు. తలైవాస్ రైడర్ రాహుల్ (5 పాయిం ట్లు) పూర్తిగా నిరాశ పరిచాడు. 18 మ్యాచ్ల్లో తలైవాస్కు ఇది 12వ ఓటమి. 'షో మ్యాన్' రాహుల్ చౌదరి, కెప్టెన్ అజయ్ ఠాకూర్ వరుసగా విఫలం కావడం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
మ్యాచ్ ఆరంభంలో తలైవాస్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. రాహుల్ చౌదరి రాణించడంతో ఓ దశలో యూపీని ఆలౌట్ చేసి 11-6తో నిలిచింది. ఇక్కడి నుండి యూపీ హవా కొనసాగింది. రైడర్ శ్రీకాంత్ వరుస పాయింట్లు తేవడంతో పుజుకున్న యూపీ 13-14తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం అనంతరం కూడా యూపీ దూకుడుగా ఆడింది. ఇదే ఊపులో 26-16తో భారీ ఆధిక్యంలో నిలిచింది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ముగుస్తుండగా 40-19తో నిలిచిన యూపీ విజయం సాధించింది.
శనివారం జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్ 28-28తో టైగా ముగిసింది. జైపూర్ తరఫున ట్యాక్లింగ్లో విశాల్ (9), దీపక్ హుడా (4) రాణించారు. గుజరాత్ జట్టులో సచిన్ (5), పర్వేశ్ భైంస్వాల్ (5) ఐదేసి పాయింట్లు సాధించారు. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం జైపూర్దే ఆధిక్యమైనా.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కెప్టెన్ దీపక్ నివాస్ హుడా రైడింగ్లో ఆకట్టుకున్నా.. మిగతావారు విఫలమయ్యారు. కీలకమైన ద్వితీయార్ధంలో పుంజుకున్న గుజరాత్. .జైపూర్కు ధీటుగా ఆడి టైగా ముగించింది. నేటి మ్యాచ్ల్లో యు ముంబాతో ఫార్చూన్ జెయింట్స్; బెంగాల్ వారియర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.