
జకార్తా: భారత్ ఆసియా గేమ్స్ క్రీడా సంరంభంలో శుభారంభాన్ని నమోదు చేసుకుంది. శనివారం ఆరంభ వేడుకల అనంతరం భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. మమతా పుజారి నేతృత్వంలోని భారత మహిళల జట్టు జపాన్తో తలపడింది. తొలి లీగ్ మ్యాచ్లో ప్రత్యర్థిపై 43-12 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన జట్టు జపాన్ మహిళలు ఏ దశలోనూ డిఫెండింగ్ ఛాంపియన్కు పోటీనివ్వలేకపోయారు.
ఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్ కర్నొ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు పద్దెనిమిదో ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పురుషుల కబడ్డీ జట్టు తొలి మ్యాచ్ శ్రీలంకతో సాయంత్రం 5.30కు ప్రారంభం కానుంది. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (రవి కుమార్, అపూర్వీ చండేలా)లు ఫైనల్కు చేరింది.
భారత మహిళా బాస్కెట్బాల్ జట్టు మాత్రం తొలి గేమ్లో విజయాన్ని నమోదు చేసుకుంది. 61-84తేడాతో చైనీస్ తైపీతో పోరాడి ఓడింది. 18వ ఆసియా గేమ్స్లో గ్రూపు దశలో ఓడిపోవడం భారత్కు రెండోసారి. ఇంతకుముందు కజకిస్థాన్తో తలపడి 61-79 తేడాతో ఓడిపోయింది. గ్రూపు ఏ మ్యాచ్లో మ్యాచ్ సగం ముగిసే వరకూ భారత్ 28-33 స్కోరును కొనసాగించింది. మొదటి అర్థ భాగం ఎంతో వ్యత్యాసం చూపకపోయినా రెండో భాగంలో దూకుడు పెంచింది.
ఇక రెండో భాగంలో చైనీస్ తైపీ 64-45గా ముగించినా చైనీస్ మహిళా జట్టు అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. భారత్ తన తరువాయి మ్యాచ్ను ఆగష్టు 20న ఉత్తర కొరియాతో తలపడనుంది. కాగా, ఇండోనేషియా ఆగష్టు 23న తన తర్వాతి మ్యాచ్ ఆడనుంది.