హైదరాబాద్: ఇటీవల జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ ఏడు పతకాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. హాకీ విభాగంలో 41 ఏళ్ల తర్వాత భారత్కు పతకం దక్కింది. మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని పురుషుల హాకీ జట్టు జర్మనీని ఓడించి భారత్కు కాంస్య పతకం అందించింది. పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు ఆటగాళ్లకు ఇప్పటికే భారీ నగదు నజరానాలతో ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి వారిని మరింత ప్రత్యేకంగా గౌరవించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వ పాఠశాలలకు ఆటగాళ్ల పేర్లను పెట్టనుంది.
ఒలింపిక్స్ 2020లో పాల్గొన్న భారత హాకీ జట్టులో పంజాబ్ నుంచే అత్యధిక మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. దాదాపు 10 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పది ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక ఆటగాళ్ల పేర్లను మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అంగీకారం తెలిపినట్లు పంజాబ్ విద్యాశాఖా మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా పేర్కొన్నారు. మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, రూపిందర్పాల్ సింగ్, హార్దిక్ సింగ్, శంషీర్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్ పంజాబ్కు చెందిన ఆటగాళ్లే.
మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు పంజాబ్ విద్యాశాఖా మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా చెప్పారు. ఇకపై ఆ పాఠశాల పేరును ఒలింపియన్ మన్ప్రీత్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్, మిథాపూర్గా మారుస్తామని తెలిపారు. అలాగే అమృత్సర్లోని తిమ్మోవల్ పాఠశాల పేరును వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పేరుతో మార్చనున్నట్లు పేర్కొన్నారు. అట్టారి పాఠశాల పేరును ఒలింపియన్ శంషర్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్గా.. ఫరీద్కోట్లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్ రూపిందర్పాల్ సింగ్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మారుస్తామన్నారు.
ఖుస్రోర్పూర్ పాఠశాల పేరును ఒలింపియన్ హార్దిక్ సింగ్ పాఠశాల అని, గురుదాస్పూర్లోని చాహల్ కలాన్ పాఠశాల పేరును ఒలింపియన్ సిమ్రంజిత్ సింగ్ ప్రభుత్వ పాఠశాలగా మార్చనున్నట్లు పంజాబ్ మంత్రి విజయ్ ఇందర్ పేర్కొన్నారు. కాగా,ఒలింపిక్స్ క్రీడల్లో ఘన చరిత్ర కలిగిన భారత పురుషుల హాకీ జట్టు గత 40 ఏళ్లుగా పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే మన్ప్రీత్ సింగ్ సారథ్యంలో టోక్యోలో చెలరేగిన ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్లో జర్మనీని ఓడించి కాంస్య పతకంతో మెరిశారు. భారత హాకీ జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు ఆ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో అతగాడికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించారు.
మంగళవారం నుంచి టోక్యో వేదికగానే పారాలింపిక్స్ విశ్వక్రీడలు మొదలుకానున్నాయి. మొదట్లో మనదేశంలో పారాలింపిక్స్ పెద్దగా గుర్తింపు లేకపోయినా.. 2016 రియోలో జరిగిన ఈ గేమ్స్లో భారత్ అనూహ్యంగా పతకాలు కొల్లగొట్టడంతో అందరి దృష్టీ వీటిపై పడింది. ఈసారి టోక్యోలో జరిగే ఈ మెగా ఈవెంట్కు అంతా సిద్ధమైంది. ఒలింపిక్స్.. పారాలింపిక్స్ రెండింట్లోనూ జరిగే క్రీడలకు తేడా ఏమీ ఉండదు. కానీ పాల్గొనే అథ్లెట్లు మాత్రం విభిన్నం. క్రీడల్లో అపార ప్రతిభ చూపడంతో పాటు అంగవైకల్యం కలిగిన వారే పారా గేమ్స్లో పాల్గొంటారు. అయితే ఒలింపిక్స్కు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నా పారాలింపిక్స్ మాత్రం ఆరు దశాబ్దాల నుంచే జరుగుతున్నాయి. 1960, రోమ్లో మొదటిసారిగా ఈ గేమ్స్ ప్రారంభమయ్యాయి. అప్పట్లో 23 దేశాల నుంచి 400మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. కానీ తాజాగా జరగబోతున్న టోక్యో పారాలింపిక్స్లో 160 దేశాల నుంచి 4,400 మంది తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు.