భువనేశ్వర్: ఒడిషాలోని సుందర్గఢ్ జిల్లా రూర్కెలాలో ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం నిర్మించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ప్రకటించారు. 2023 పురుషుల హాకీ ప్రపంచకప్నకు ఆతిథ్యమివ్వనున్న ఒడిషా.. ఆ దిశగా అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ క్రమంలోనే రూర్కెలాలోని బిజు పట్నాయక్ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆవరణలోని 15 ఎకరాల్లో 20 వేల మంది కూర్చుని మ్యాచ్ చూసేలా ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు.
'ప్రతిష్ఠాత్మక 2023 పురుషుల హాకీ ప్రపంచకప్ను ఒడిషాలో నిర్వహించబోతున్నందుకు గర్వంగా ఉంది. సుందర్గఢ్ జిల్లాలో హాకీ ఛాంపియన్లకు కొదవలేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆ క్రీడకు గొప్ప ఆదరణ లభిస్తోంది. హాకీ ఆటగాళ్లకు మద్దతు ఇచ్చే విషయంలో ఇక్కడి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. భారత హాకీకి ఈ జిల్లా చేసిన సేవలకు గాను రూర్కెలాలో 20 వేల మంది సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి హాకీ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నా. ప్రపంచంలో హాకీకి ఇదే ఉత్తమ వేదికగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దుతాం' అని సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని మొతేరా వద్ద నిర్మితమయిన విషయం తెలిసిందే. 'మొతేరా'ను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా పేరు మార్చారు. లక్షకు పైగా మంది కూర్చొనే ఈ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కంటే పెద్దది. మొతేరా క్రికెట్ స్టేడియాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరంభించారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచులు అక్కడ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ వేదికగా యూఏఈకి మారడంతో అది కుదరలేదు.
'రహానే ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన.. కోహ్లీలా దూకుడు ప్రదర్శించలేడని పొరపాటు పడొద్దు'