న్యూఢిల్లీ: భారత హాకీలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కు కరోనా సోకింది. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో పాటు డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, కిషన్ పాఠక్ వైరస్ బారిన పడ్డారు. నెల రోజుల విరామం తర్వాత వీరందరూ తమ స్వస్థలాల నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరయ్యేందుకు వచ్చారు. వీరందరికీ వైరస్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది.
అంతకుముందు లాక్డౌన్ కారణంగా దాదాపు రెండున్నర నెలలు (జూన్ వరకు) సాయ్ కేంద్రంలోనే భారత హాకీ జట్టు ఆటగాళ్లు ఉన్నారు. ఆ తర్వాత అందరూ సొంత ఇళ్లకు వెళ్లారు. నెల రోజుల విరామం తర్వాత బెంగళూరులోని సాయ్ దక్షిణ కేంద్రానికి తిరిగి తిరిగిరావాలని అధికారులు సూచించారు. కేంద్రానికి వచ్చే ఆటగాళ్లకు పరీక్షలు చేయగా.. ఐదుగురికి వైరస్ సోకింది. వారందరిని క్వారంటైన్లో పెడుతున్నారు.
'బెంగళూరులోని సాయ్ క్యాంపస్లో స్వీయ క్వారంటైన్లో ఉన్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నా. అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. ఆటగాళ్లందరికీ కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తుండడం పట్ల సంతోషంగా ఉంది' అని పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ తెలిపాడు.
మొదట నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో ఈ ఐదుగురికి నెగెటివ్గానే వచ్చింది. కానీ ఆ తర్వాత మన్ప్రీత్, సురేందర్లో వైరస్ లక్షణాలు కన్పించడంతో వాళ్లతో పాటు మరో 10మంది ఆటగాళ్లకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. మిగతా ఆటగాళ్ల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సాయ్ పేర్కొంది.
England vs Pakistan: రసపట్టులో తొలి టెస్టు.. 219కే ఇంగ్లండ్ ఆలౌట్.. పాక్ ఆధిక్యం 244 పరుగులు