హైదరాబాద్: కొద్ది రోజుల ముందే ముగిసిన రష్యా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మరువక ముందే క్రీడా ఔత్సాహికుల ముంగిట మరో ప్రపంచ కప్ ట్రోఫీ నిల్చొంది. కొన్నేళ్లుగా క్రీడా రంగంలోనూ రాణిస్తోన్న మహిళలు.. హాకీ ప్రపంచంలో భారత్ను ఛాంపియన్గా నిలిపేందుకు సన్నద్ధమయ్యారు. జూలై 21 నుంచి మొదలుకానున్న ఈ ప్రపంచ కప్లో మొత్తం 16దేశాలు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తోన్న రాణి రాంపాల్.. తమ జట్టు పట్ల ప్రగాఢ నమ్మకాన్ని కనబరుస్తోంది.
'మా జట్టులో ముగ్గురు.. నలుగురు మినహాయించి మిగిలిన వారందరూ రెండేళ్లకు మించిన అనుభవం ఉన్న వాళ్లే. ఇప్పటికీ ఎన్నో టోర్నీల్లో కప్ గెలుచుకున్న యోధులు. ఈ అనుభవమే మాకు ట్రోఫీని గెలిచేందుకు ప్రధాన ఆయుధంగా మారనుంది' అని అభిప్రాయపడింది. గతేడాది నవంబరులో ముగిసిన ఆసియన్ కాంటినెంటల్ ఛాంపియన్ షిప్లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనాపై 5-4 తేడాతో గెలుపొందిన భారత్ ట్రోఫీని సాధించింది.
కాగా, 16 రోజుల పాటు జరగనున్న 36 మ్యాచ్ లలో టీమిండియా తొలి మ్యాచ్గా ఇంగ్లాండ్తో తలపడనుంది. టాప్ 10 ప్రపంచ ర్యాంకు కల్గి ఉన్న టీమిండియా ఎనిమిదేళ్లుగా ఇప్పటి వరకూ ఒక్క ప్రపంచ కప్లోనూ పాల్గొనలేదు. అంతేకాకుండా రాణి రాంపాల్.. దీపికా మినహాయించి ఎవ్వరూ ప్రపంచ కప్లో ఆడలేదు.
'మా జట్టు ఆడేందుకు సంసిద్ధంగా ఉంది. ఈ క్షణం కోసం దాదాపు ఆసియా కప్ విజయానంతరం సంవత్సర కాలం నుంచి ఎదురుచూస్తున్నాం. జట్టులో ప్రతి ఒక్కరికీ ప్రపంచ కప్లో ఆడడం ఒక కొత్త అనుభూతిగానే భావిస్తున్నాం' కెప్టెన్ రాణి రాంపాల్ తెలిపారు. భారత్ను పూల్-బీలో కేటాయించగా ఇంగ్లాండ్, ఐర్లాండ్, యూఎస్ఏలతో కలిసి టోర్నీలో పాల్గొంటుంది. కాగా, తన తొలి మ్యాచ్ జూలై 21న ఇంగ్లాండ్తో ఆడనుంది.