ఫిఫా వరల్డ్ కప్లో పోర్చుగల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్లో స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో బెంచ్కే పరిమితమయ్యాడు. చివర్లో కాసేపు మాత్రమే అతను మైదానంలో దిగాడు. ఈ క్రమంలో పోర్చుగల్ మేనేజర్ ఫెర్నాండో తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రొనాల్డో స్థాయి ఆటగాడిని బెంచ్పై కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు.
అయితే ప్రస్తుతం ఫామ్లో లేని రొనాల్డో.. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక్క గోల్ మాత్రమే చేశాడు. అది కూడా తొలి మ్యాచ్లో పెనాల్టీ కిక్ను గోల్గా మలిచాడు. ఆ తర్వాత ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయాడు. ఈ క్రమంలోనే నాకౌట్ మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టిన మేనేజర్.. యువ ప్లేయర్ రామోస్ను పంపాడు. స్విట్జర్లాండ్పై అద్భుతంగా ఆడిన రామోస్.. ఈ వరల్డ్ కప్లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్ను చిత్తు చేసింది. గోల్స్ పరంగా ఈ వరల్డ్ కప్లో పోర్చుగల్కు ఇదే అతిపెద్ద విజయం.
ఈ నేపథ్యంలో రొనాల్డోను ఇలా పక్కన పెట్టడం మాత్రం చాలా మందికి నచ్చలేదు. ఐదు సార్లు బాలన్ డీఆర్గా నిలిచిన రొనాల్డో అద్భుతమైన ఆటగాడని, అతన్ని ఇలా అవమానించడం ఏమీ బాగలేదని అంటున్నారు. ఈ జాబితాలో రొనాల్డో ప్రేయసి జార్జీనా రోడ్రిగెజ్ కూడా చేరింది. ఆమె తన ఇన్స్టా ఖాతాలో ఈ విషయంపై ఒక పోస్టు పెట్టింది.
''కంగ్రాచ్యులేషన్స్ పోర్చుగల్. ఆ 11 మంది ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపిస్తుంటే.. అందరి కళ్లు మాత్రం నీపైనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు ఆడటాన్ని 90 నిమిషాలపాటు ఎంజాయ్ చేయలేకపోవడం ఎంత దురదృష్టం. ఫ్యాన్స్ నువ్వు రావాలని కోరుతూ నిన్ను పిలుస్తూనే ఉన్నారు. ఆ భగవంతుడు, నీ స్నేహితుడు ఫెర్నాండో మరోసారి మా అందరికీ ఆనందాన్ని పంచాలని ఆశిస్తున్నా' అని ఆమె పోస్టు చేసింది. ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.