
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తనకు వైరస్ సోకిందని భారత స్టార్ స్ట్రైకర్, బెంగళూరు ఎఫ్సీ సారథి సునీల్ ఛెత్రి ట్విటర్లో గురువారం వెల్లడించాడు. దీంతో మార్చి 25న దుబాయ్ వేదికగా ఒమన్తో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే వేదికపై మార్చి 29న యూఏఈతో జరిగే స్నేహపూర్వక మ్యాచ్కు అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది.
'ఇదొక చేదువార్త. ఈరోజు నాకు కరోనా పాజిటివ్గా తేలింది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. వైరస్ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాను. అతి త్వరలోనే ఫుట్బాల్ మైదానంలో మళ్లీ అడుగుపెడతాను. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వద్దు' అని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ట్విటర్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు ఛెత్రికి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
సునీల్ ఛెత్రి ఇటీవల ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 టోర్నమెంట్లో పాల్గొన్న విషయం తెలిసిందే. బెంగళూరు ఎఫ్సీకి అతడు నాయకత్వం వహించాడు. ఈ సీజన్లో బెంగళూరు జట్టు లీగ్ దశలో 7వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 22 పాయింట్లతో టోర్నీని ముగించింది. ఈ సీజన్లో ఛెత్రి జట్టు 5 మ్యాచులు గెలిచి, 7 డ్రా చేసుకుంది. ఇక 8 మ్యాచులలో ఓడిపోయింది. ఛెత్రి 20 మ్యాచులలో 8 గోల్స్ మాత్రమే చేశాడు.