కోచి: కేరళ బ్లాక్ బస్టర్స్ చేతిలో ఓటమి పాలైనా తమకు సెమీ ఫైనల్స్ లో బెర్తు ఆశలు అడుగంటిపోలేదని ఎఫ్ సి పుణె కోచ్ అంటోనియో హబాస్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం కేరళతో జరిగిన మ్యాచ్ లో పుణె 2 - 1 స్కోర్ తేడాతో పుణె ఓటమి పాలైంది. డంకెన్స్ నాజోన్ ఏడో నిమిషంలోనే గోల్ చేయడంతో వెనుకబడిన పుణె జట్టు.. సెకండాఫ్ లో కేరళ సారధి అరోన్ హుగెస్ రెండో గోల్ చేయడంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.
అంతేకాదు ఈ సీజన్ లో వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకున్నది. ఇంజ్యూరీ సమయంలో అనిబల్ రోడ్రిగెజ్ కన్సోలేషన్ గోల్ సాధించినా ప్రయోజనం లేకపోయింది. తమ జట్టు ప్లేయర్లు గాయాల పాలవ్వడంతోపాటు గెలుపొటములను సమానంగా స్వీకరించాలని పుణె జట్టు కోచ్ అంటోనియో హబాస్ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో కుర్రాళ్లు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం కూడా మ్యాచ్ ఓటమికి దారి తీసిందని వ్యాఖ్యానించాడు.
'ప్రారంభ దశలోనే మేం గోల్ ఇవ్వడం ప్రతికూల పరిస్థితులకు దారి తీసింది. సెకండాఫ్ లో గాయపడిన గుస్తావో ఓబర్మన్ స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. ఈ పరిణామాలు మొత్తం మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. మాకు చాలా మంచి చాన్స్ లు మూడు లభించాయి. గోల్ చేసేందుకు అత్యంత సన్నిహిత ప్రదేశంలో రెండు అవకాశాలు వచ్చినా సద్వినియోగంచేసుకోలేదు' అని హబాస్ చెప్పాడు.
వినూత్న ప్రయోగాలు చేయడంలో పుణె వెనుకబడిందని, అటువంటి ఆలోచనే చేయక పోవడం కూడా దెబ్బతీసిందన్నాడు. 'మాకు మిడ్ ఫీల్డ్లో అదనపు మిడ్ ఫీల్డర్లు ఉన్నారు. కానీ కేరళ బ్లాక్ బస్టర్స్ మా వ్యూహం కోసం వేచి చూశారు. అర్థమయ్యే వరకు వేచిచూసిన కేరళ కుర్రాళ్లు తర్వాత అటాకింగ్ కు దిగారు. సెమీ ఫైనల్స్ అర్హత సాధించేందుకు మాకు ఈ మ్యాచ్ చాలా కీలకం అని వారి తెలుసు. అందుకే వారు కౌంటర్ అటాకింగ్ దిగారు. గోల్స్ సాధించారు' అని చెప్పాడు.
'మా కుర్రాళ్లు అటాకింగ్ కు దిగినా పాయింట్లు సాధించలేకపోయారు' అని అంగీకరించాడు. 'మా టీం అంతా అటాకింగ్ చేసినా.. కార్నర్ వద్దపాయింట్లు ఇచ్చాం. ఇది మాకు చాలా మంచి మ్యాచ్. మేం చాలా బాగా ఆడాం' అని పేర్కొన్నాడు. పుణె కుర్రాళ్లు 15 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచారు. డిసెంబర్ రెండో తేదీన జరిగే మ్యాచ్లో కోల్ కతాతో తలపడతారు. తమకు సెమీ ఫైనల్స్ కు తలుపులు మూసుకు పోలేదన్నాడు.
తాము 18 పాయింట్లు సాధించగలిగితే సెమీస్ కు అర్హత సాధించినట్లేనన్నాడు. లీగ్ టోర్నీలో పలు మార్పులు జరుగుతుంటాయని, గత మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యామని, దేశమంతా ప్రయాణానికే సమయమంతా సరిపోతున్నదని, విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉండటం లేదన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో లింగ్డో వంటి ప్లేయర్ అనారోగ్యం కారణంగా అందుబాటులో లేకపోవడం తమ జట్టు అవకాశాలను దెబ్బ తీసిందన్నాడు.
విజయార్హత మాదేనన్న కొప్పెల్
శుక్రవారం పుణెతో జరిగిన మ్యాచ్ లో గెలువాల్సింది తామేనని కేరళ బ్లాక్ బస్టర్స్ కోచ్ స్టీవ్ కొప్పెల్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్ లో విజయం ద్వారా పాయింట్ల పట్టికలో కేరళ 18 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నది. నిజంగా తమ జట్టు సాధించిన విజయాన్ని స్వాగతిస్తున్నట్లు కొప్పెల్ తెలిపాడు. తమ కుర్రాళ్లు పలు అవకాశాలు స్రుష్టించగలిగారని, అందుకు తాను సంతోషిస్తున్నాడని తెలిపాడు.
అదే సమయంలో త్రుటిలో అవకాశాలు తప్పిపోయిన ఘటనలు కూడా ఉన్నాయన్నాడు. కానీ మ్యాచ్ లో విజయం సాధించడం గర్వంగానూ, ఆనందంగానూ ఉన్నదని పేర్కొన్నాడు. బాగా ఆడుతున్నందున ఈ మ్యాచ్ లో గెలుపు తమదేనని ఊహించానన్నాడు. ఇంతకుముందు ముంబై సిటీతో జరిగిన మ్యాచ్ లో కేరళ 5 - 0 స్కోర్ తేడాతో కేరళ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
తమ కుర్రాళ్లలో ఆత్మస్థైర్యం చాలా మెండుగా ఉందని పేర్కొన్నాడు. ఈ లీగ్ లో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు దాగి ఉన్నాయన్నాడు. ఏ జట్టు ముందుకు దూసుకెళ్తుందో ఊహించలేమని తెలిపాడు. తదుపరి వచ్చే మంగళవారం కోల్ కతాలోని రవీంద్ర సారోబార్ స్టేడియంలో మాజీ చాంపియన్లు అట్లెటికో డీ కోల్కతా జట్టుతో కేరళ జట్టు తలపడనున్నది.