అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్న యువ ఫుట్బాల్ ప్లేయర్ అన్వర్ అలీ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అతన్ని ఇండియన్ సూపర్ లీగ్లోని ఎఫ్సీ గోవా జట్టు టీంలో చేర్చుకుంది. టీంలో ప్రవేశించినప్పటికీ తుది జట్టులో చోటు సంపాదించుకోవడం అలీకి సవాల్గా మారింది. గుండె జబ్బు కారణంగా 2019లో అలీపై ఫుట్ బాల్ ఆడకుండా నిషేధం విధించారు. గుండె జబ్బుకు అలీ దేశ, విదేశాల్లో చికిత్స తీసుకున్నాడు. అయితే గుండె జబ్బు కారణంగా తనను ఏ జట్టు చేర్చుకోకపోవడం, ఫుట్బాల్ సమాఖ్య నిషేధం విధించడంతో అలీ ఢిల్లీ హైకోర్డును ఆశ్రయించాడు. తనకు ఫుట్ బాల్ ఆడేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరాడు. ఆటలో తనకు ఏమైన జరిగితే పూర్తి బాధ్యత తనదే అని పేర్కొన్నాడు.
పంజాబ్కు చెందిన 21 ఏళ్ల అన్వర్ అలీ 2017లో అండర్-17, అండర్-20 విభాగాల్లో టీమిండియా ఫుట్బాల్ జట్టు తరఫున ఆడాడు. 2020లో అతనికి ఇండియన్ సూపర్ లీగ్లో ముంబై సిటీ ఎఫ్సీ తరఫున ఆడే అవకాశం వచ్చింది. అవకాశం అయితే వచ్చింది కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది. టోర్నీకి ముందు జరిపిన పరీక్షల్లో అన్వర్ ఎపికల్ హైపర్ కార్డియో మయోపతీ-హెచ్సీఎం అనే అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో అతను ఫుట్బాల్కు దూరం కావాల్సి వచ్చింది. దీంతో సంవత్సరంపాటు చికిత్స తీసుకున్నాడు. అలీ ముంబైలోని కార్డియాలజిస్టులతోపాటు ఫ్రాన్స్లోని వైద్యులతో కూడా చికిత్స తీసుకున్నాడు. దీంతో అన్వర్ మళ్లీ తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆడే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో అన్వర్కు సెకండ్ డివిజన్ ఐ-లీగ్లో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ అతనికున్న గుండె జబ్బు నుంచి పూర్తిగా కోలుకోకపోవడం అలీకి మైనస్గా మారింది. దీంతో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అతడిని అడ్డుకుంది. అలీ ఇలాగే ఆడితే అతడి జబ్బు మరింత తీవ్ర తరం అయి ప్రాణాలకే ముప్పు అని తెలిపింది. వైద్య బృందం అలీ గుండె జబ్బుపై ఓ నిర్ణయం తీసుకోనిది, ఆడడానికి అనుమతిచ్చే వరకు ఆడరాదని ఏఐఎఫ్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్వర్ ఢిల్లీ కోర్టుకెక్కాడు.
యూకేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ కార్డియాలజిస్ట్ శర్మ యూరో 2020 మ్యాచ్లో కార్డియాక్ అరెస్ట్కు గురైన డెన్మార్క్కు చెందిన క్రిస్టియన్ ఎరిక్సెన్తో సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫుట్బాల్ ఆటగాళ్లలో కొంతమందికి చికిత్స అందించారు. ఏఐఎఫ్ఎఫ్కు సమర్పించిన సమర్పణలో శర్మ.. అలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఏఐఎఫ్ మెడికల్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఆడేందుకు ఢిల్లీ హైకోర్టు అలీని అనుమతించింది. అలీ ఉత్తరాఖండ్, పంజాబ్ మరియు ఢిల్లీలోని స్థానిక లీగ్లలో దిగువ విభాగాల్లో పోటీ పడ్డాడు. దీంతో అలీ తాజాగా గోవా జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.