కాబుల్: గత ఆదివారం కాబుల్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు విజయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అఫ్గాన్లోని పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారాయి. తాలిబన్లు విద్రోహ చర్యలకు తెగబడుతుండటంతో అఫ్గాన్ ప్రజల్లో భయాందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కాబుల్లో చాలామంది ఇళ్ల నుంచి అడుగు కూడా బయటపెట్టడం లేదు. మరికొందరు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం, గురువారం కాబుల్ విమానాశ్రయానికి వందల మంది తరలివచ్చారు. అయితే అఫ్గాన్ నుంచి బయటకు తరలిపోవాలనే తపనలో విమానంపైకి చేరుకుని.. అది టేకాఫ్ అవుతున్నప్పుడు జారి కిందపడి చాలా మంది మరణించారు. ఇందులో యువ క్రీడాకారుడు కూడా మరణించడం అందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి బయల్దేరిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన తెలిసిందే. తాజాగా విమానం నుంచి కిందపడిన వివరాలు బయటకు వచ్చాయి. ముగ్గురిలో ఓ యువకుడు మృతి చెందడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందుకంటే.. ఆ దేశ జాతీయ ఫుట్బాల్ ఆటగాడు జాకీ అన్వారీ విమానం నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. అఫ్గాన్ జాతీయ ఫుట్బాట్ జట్టులో అన్వారీ ఒక సభ్యుడు.
సోమవారం నాటి ఘటనలో జాకీ అన్వారీ ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ డైరెక్టర్ జనరల్ దావూద్ మొరాడియన్ గురువారం ఐరాస భద్రత మండలికి తెలిపారు. అమెరికా యుద్ధ విమానం సీ-17 పై నుంచి కిందపడిన వారిలో జాకీ ఒకడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా శాఖ కూడా ధ్రువీకరించింది. ఈ విషయం తెలుసుకున్న క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎంతో ప్రతిభ గల క్రీడాకారుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్యంత దారుణ పరిస్థితిలో మరణించడం అందరిని కలచివేస్తోంది. జాకీ అన్వరీ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అఫ్గాన్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు కూడా గందరగోళంలో పడిపోయింది. ఈ క్రమంలోనే వారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్లు ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సందిగ్ధతకు తెరదించుతూ సన్రైజర్స్ హైదరాబాద్ క్లారిటీ ఇచ్చింది. 'ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదానిపై మేము మాట్లాడలేం. కానీ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు' అని సన్రైజర్స్ టీమ్ సీఈవో షణ్ముగం స్పష్టం చేశారు. ఈ నెల 31న తమ టీమ్ యూఏఈకి బయలుదేరుతోందని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి.
మరోవైపు అఫ్గనిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాక్తో శ్రీలంక వేదికగా వచ్చే నెలలో జరగాల్సిన వన్డే సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ సిరీస్కు తాలిబన్లు అంగీకారం తెలిపారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సిరీస్ యధావిధిగా కొనసాగుతుందట. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే సిరీస్ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో క్రికెట్ ప్రపంచం అవాక్కయ్యింది. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్తోట వేదికగా పాక్, ఆఫ్గన్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది.