
ఘోరాతి ఘోరం జరిగింది. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 127మంది మరణించారు. 180మంది గాయపడ్డారు. ఈ మేరకు రాయిటర్స్ నివేదిక ప్రకారం.. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలో జరిగిన మ్యాచ్లో జావానీస్ క్లబ్లు అరెమా, పెర్సెబయా సురబయ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అరెమా జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అయితే అప్పటికే మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల అభిమానులు నినాదాలు, దూషణలతో స్టేడియం లోపల అల్లరి అల్లరి చేశారు.
అయితే సడెన్గా ఓటమి అనంతరం పెర్సబయా జట్టు అభిమానులు ఘోరంగా కేకలు, ఈలలు వేస్తూ హేళనకు దిగారు. అరెమా జట్టు అభిమానులు పట్టరాని కోపంతో తొలుత ఓ గ్రూప్ మధ్య గొడవ స్టార్ట్ కాగా..అది చినికి చినికి గాలివానలా మారింది. ఇక ఇరు జట్ల అభిమానుల మధ్య బాహబాహీలు మొదలయ్యాయి. స్టేడియంలోకి అభిమానులు చొరబడి తన్నుకున్నారు. తక్కువమంది పోలీసులు ఉండడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఇక చేసేదేం లేక పోలీసులు లాఠీ ఛార్జి మొదలెట్టారు. అయినప్పటికీ వేలాది మంది గొడవల్లో నిమగ్నమయ్యారు.
దీంతో పోలీసులు ఈసారి ఏకంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక టియర్ గ్యాస్ దెబ్బకు అభిమానులు గేట్ల వైపు పరిగెత్తారు. వేలాది మంది గేట్ల వద్దకు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట ఘోరంగా జరిగింది. చిన్నపిల్లలు, మహిళలతో సహా మొత్తం 127మంది తొక్కిసలాటలో చనిపోయారు. కాళ్ల కింద నలిగిపోయిన శవాలపైనే ప్రేక్షకులు పరుగులు పెట్టడం కలచివేసింది. స్టేడియం భయానక పరిస్థితితో దద్దరిల్లింది. స్టేడియం బయట రోడ్ల వెంట కూడా ఇరు జట్ల అభిమానులు ఒకరినొకరు వెంటబడి మరీ కొట్టుకున్నారు.
టియర్ గ్యాస్ ప్రయోగించడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని ఈస్ట్ జావా పోలీసు చీఫ్ నికో అఫింటా విలేకరులతో అన్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఈ విషయమై ఇండోనేషియా క్రీడా మంత్రి జైనుదిన్ అమాలీ రాయిటర్స్తో మాట్లాడుతూ.. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. ఫుట్బాల్ మ్యాచ్లలో భద్రతను మరింత మెరుగుపర్చడానికి చూస్తామన్నాడు. వారం పాటు అన్నీ ఫుట్ బాల్ మ్యాచ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపాడు. ఈ ఘటనకు కారకులపై విచారణ జరిపి కఠినంగా శిక్షిస్తామన్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్లో పెర్సెబయా 3-2తో గెలిచింది.