|
టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్కు రాసిన కాలమ్లో
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ ముందు అందరూ పిగ్మీలే అని తేల్చి చెప్పారు. విరాట్ కోహ్లీకి సూపర్ స్టార్ హోదా ఉన్నంతకాలం టీమిండియా విదేశాల్లో సిరిస్లు గెలవలేదని ఆయన తేల్చి చెప్పారు. గతేడాది జూన్లో తన రాజీనామా లేఖలో కూడా భారత క్రికెట్లో 'సూపర్స్టార్' కల్చర్తో పాటు ధోని, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ల పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై స్పందించారు. అంతేకాదు ఈ సూపర్స్టార్ కల్చర్ తనకు నచ్చకపోవడం వల్లే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్కు ఆయన రాజీనామా చేశారు. తాజాగా జనవరి 20 (శనివారం) 'పాలిటిక్స్ అండ్ ప్లే' ఆనే దానిపై టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్కు రాసిన కాలమ్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కోహ్లీ అనుమతి లేనిదే బీసీసీఐ ఏ పనీ చేయదు
ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో బీసీసీఐ విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటుందని, అతని అనుమతి లేనిదే ఏ పనీ చేయదని అందులో రాసుకొచ్చారు. 'కోహ్లీని బీసీసీఐ పూజిస్తుంది. కేంద్ర కేబినెట్లో మంత్రులు కూడా ఆ రేంజ్లో ప్రధాని మోడీని కీర్తించరేమో' అని గుహ అన్నారు. టీమిండియా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్, నేషనల్ క్రికెట్ అకాడమీలాంటి విషయాలపై బీసీసీఐ పాలకుల కమిటీ చర్చిస్తుంటే, బీసీసీఐ లీగల్ కౌన్సిల్ మాత్రం కోహ్లీ అనుమతి తీసుకుంటుందని గుహ తెలిపారు. నిజానికి ఈ విషయంలో కోహ్లీకి ఎటువంటి సంబంధం లేదు.
విదేశీ గడ్డపై కోహ్లీ సేన రాణించకపోవడానికి కారణం
ఇక, ఉపఖండం బయట టీమిండియా పెద్దగా రాణించకపోవడానికి కారణాల్లో ఇది కూడా ప్రధానమైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. 'అవినీతి, బంధుప్రీతికి తోడు బీసీసీఐలో సూపర్స్టార్ సిండ్రోమ్ కూడా వచ్చి చేరింది. కోహ్లీ గొప్ప ప్లేయర్, గొప్ప లీడరే కావచ్చు. కానీ సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు, మార్పులపై దృష్టిసారించకపోతే కోహ్లీ విదేశాల్లో కోరుకుంటున్న సక్సెస్ సాధ్యం కాదు' అని ఆయన తేల్చి చెప్పారు. వినోద్రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పాలకుల కమిటీ కూడా కోహ్లీ మాటకు ఎదురు చెప్పడం లేదని ఆయన అన్నారు. కోహ్లీ కారణంగానే కుంబ్లేను తప్పించి ఏమాత్రం కోచింగ్ అనుభవం లేని రవిశాస్త్రిని కోచ్గా నియమించారని ఆయన చెప్పారు.
అనిల్ కుంబ్లే-విరాట్ కోహ్లీ వివాదంపై కూడా
భారత క్రికెట్ అందించిన అత్యుత్తమ బౌలర్లలో అనిల్ కుంబ్లే ఒకడని అన్నారు. గేమ్ విషయానికి వస్తే అతడి ఆలోచనలు అద్భుతమని కొనియాడారు. టామ్ మూడీలాంటి అనుభవం ఉన్నవారిని పక్కనపెట్టడానికీ కూడా ఇదే కారణమని అన్నారు. కోహ్లీసేన భారత్లో ఆడిన అన్ని రోజులు ఈ నిర్ణయం వెనుక ఉన్న లోపం బయటపడలేదని, ఇప్పుడు సఫారీ పర్యటనలో దాని ప్రభావం కనిపిస్తోందని గుహ అన్నారు. అంతేకాదు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేటాయించిన ప్రాక్టీస్ మ్యాచ్ను కూడా రద్దు చేయాలన్న టీమ్ మేనేజ్మెంట్ ఒత్తిడికి బీసీసీఐ తలొగ్గడం వల్లే ఇప్పుడు టెస్టు సిరీస్ను కోల్పోయే దుస్థితి వచ్చిందని అన్నారు.
ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఉంటే పరిస్థితి మరోలా
సొంతగడ్డపై శ్రీలంకతో క్రికెట్ ఆడే బదులు, ముందే దక్షిణాఫ్రికాకు వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. క్రికెటర్లు కాకపోయినా కనీసం కెప్టెన్ మాట కాదని తమ మాట నెగ్గించుకునే సెలక్టర్లు ఉన్నా ఈరోజు ఈ పరిస్థిత వచ్చి ఉండేది కాదని ఆయన చెప్పారు. ఇక, పరిస్థితులకు అనుగుణంగా కోచ్ రవిశాస్త్రి కెప్టెన్ను ఎదురించేలా ఉండే రోబోయే రోజుల్లో జట్టులో ఎంతో మార్పు వస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లీసేన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను మరో టెస్టు మిగిలుండగానే 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో చివరిదైన మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్ బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. టెస్టు సిరిస్ అనంతరం దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ను కోహ్లీసేన ఆడనుంది.