హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య విశాఖపట్నం వేదికగా అక్టోబర్ 29న జరిగిన చివరి వన్డేలో టీమిండియా విజయం సాధించడంతో పాటు 3-2తో సిరిస్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే మ్యాచ్లో ఓ అరుదైన సంఘటన యూవత్ క్రీడాభిమానులను ఆకట్టుకుంది.
ఈ వన్డే మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు తమ అమ్మల పేర్లతో ముద్రించిన జర్సీలను ధరించారు. 'స్టార్ ప్లస్' టీవీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా చేపట్టిన ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా టీమిండియా ఆటగాళ్లు ఈ జెర్సీలను ధరించిన సంగతి తెలిసిందే.
వైజాగ్ వన్డేలో అరుదైన ఘట్టం: మీరూ చూడండి (వీడియో)
పితృస్వామ్య భారతదేశంలో ప్రజలను చైతన్య పరచడానికే ఇలా చేశామని కెప్టెన్ ధోనితో పాటు జట్టు మేనేజర్స్ కూడా తెలిపారు. టాస్ అనంతరం ధోని మాట్లాడుతూ మనమెప్పుడూ తండ్రిపేరు ఇంటిపేరుగా వాడతామని అలాగే అమ్మ చేసిన త్యాగాలు, చూపే ప్రేమనూ ప్రశంసించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.
తానెప్పుడూ భావోద్వేగపరంగా అమ్మతో అనుసంధానమై ఉంటానని తెలిపాడు. చాలాసార్లు మనం అమ్మ సేవల్ని గుర్తించడం లేదని, దీనిని అందరం గుర్తుంచుకోవాలని అన్నాడు. అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ, కెప్టెన్ ధోనీ మాత్రం దీనికి భిన్నంగా చేశాడు.
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వాళ్ల అమ్మ పేరు(దేవకీ) ఉన్న జెర్సీని ధరించిన ధోని, కీపింగ్ చేస్తున్న సమయంలో మాత్రం తను ఎప్పుడూ వాడే(ధోని పేరు ఉన్న) జెర్సీనే వాడాడు. అయితే ధోని ఈ ఒక్క మ్యాచ్లోనే ఇలా చేశాడంటే మనం పప్పులో కాలేసినట్లే. సాధారణంగా ధోనీ ఎప్పుడు బ్యాటింగ్కు దిగినా హాఫ్ హ్యండ్ జెర్సీనే ధరిస్తాడట.
కానీ కీపింగ్ చేస్తున్న సమయంలో మాత్రం ఫుల్ హ్యాండ్ జెర్సీ అయితేనే తనకు సౌకర్యంగా ఉంటుందని దానినే ధరిస్తాడట. కాగా విశాఖపట్నంలో జరిగిన వన్డేలో వాళ్ల అమ్మ పేరుతో ఫుల్ హ్యండ్స్ జెర్సీ అందుబాటులో లేకపోవడంతో రెండో ఇన్నింగ్స్లో ధోని ఫుల్ హ్యాండ్ జెర్సీ ధరించి కీపింగ్ చేశాడని తెలుస్తోంది.