హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తున్న అండర్ 19 జట్టుకు రెండు వారాలుగా రోజు వారీ భత్యాలు అందట్లేదు. దీంతో అండర్ 19 ఆటగాళ్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. క్రికెటర్లకు చెల్లించాల్సిన డైలీ అలవెన్సు అందకపోవడంతో వారందరూ డిన్నర్కు వారి సొంత డబ్బులే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ద్రవిడ్ కోచ్గా ఉన్న జట్టుకు తినడానికి డబ్బులు లేవు!
ద్రవిడ్తో పాటు అండర్ 19 జట్టులోని ఆటగాళ్లకు రోజువారీ అలవెన్సులు అందకపోవడానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావమేనని బోర్డు అధికారులు అంటున్నారు. టీమిండియా ఆటగాళ్లకు రోజువారీ అలవెన్సులు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తున్న బీసీసీఐ జూనియర్ ఆటగాళ్లకు మాత్రం నగదు రూపంలో అందిస్తోంది.
అయితే సేవింగ్స్ ఖాతాల నుంచి వారానికి రూ.24 వేలకు మించి నగదు తీయడానికి అవకాశం లేకపోవడంతో అండర్ 19 ఆటగాళ్లకు రోజువారీ అలవెన్సులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అండర్ 19 జట్టులో ఎక్కువ మంది క్రికెటర్లు 18 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగివుండటంతో క్రెడిట్/డెబిట్ కార్డులను బీసీసీఐ ఇవ్వలేకపోయింది.
కాగా, అండర్-19 ఆటగాళ్లకు రోజువారీ అలెవెన్సుల కిం ద రూ.6,800 ఇస్తారు. లోధా కమిటీ సంస్కరణల అమల్లో నిర్లక్ష్యం వహించనందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీంకోర్టు తొలగించిన సంగతి తెలిసిందే. కార్యదర్శి సంతకం ఉంటేనే నిధులు విడుదలవుతాయి.
ఆ హోదాలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ చెల్లించలేకపోతున్నాం అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అండర్ 19 జట్టు రెండు వారాలుగా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగియగానే డీఏ డబ్బులు నేరుగా ప్లేయర్స్ అకౌంట్లలో వేస్తామని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.