హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిరోజు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ కోరిన అంఫైర్ రివ్యూ కెప్టెన్ కోహ్లీకి నవ్వుని తెప్పించింది.
అసలేం జరిగిందంటే మురళీ విజయ్ సెంచరీ చేసి 101 పరుగులు, కోహ్లీ 31 పరుగుల వద్ద క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో టీమిండియా 2 వికెట్లను కోల్పోయి 223 పరుగులు చేసింది. బంగ్లా లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ వేసిన ఇన్నింగ్స్ 62వ ఓవర్లో ఓ బంతిని కోహ్లీ డిఫెన్స్ ఆడాడు.
ఆ బంతి సరిగ్గా కోహ్లీ బ్యాట్కు మధ్యలో తగిలింది. అయితే దీనిని కెప్టెన్, వికెట్ కీపర్ రహీమ్ అంచనా వేయడంలో పొరపడ్డాడు. వెంటనే ఫస్ట్ స్లిప్, షార్ట్ లెగ్ ఫీల్డర్తో చర్చించి వెంటనే అంపైర్ను రివ్యూ కోరాడు. దీంతో కోహ్లీ ఎంతో సంతోషపడ్డాడు.
బంగ్లా ఓ రివ్యూను ఇంత సులువుగా కోల్పోతుందన్న విషయం తెలిసిన కోహ్లీ, నాన్ స్ట్రైకర్ విజయ్కి విషయాన్ని చెప్పి నవ్వుకున్నాడు. అసలు బంతి, బ్యాట్కు ఎక్కడ తగిలిందో చెప్పి రివ్యూ నిర్ణయం వెలువడే వరకు నవ్వుతూనే కనిపించాడు.
బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అంఫైర్ రివ్యూ కోరడంపై టెస్టు మ్యాచ్కు కామెంటేటర్లుగా ఉన్న సంజయ్ మంజ్రేకర్, అక్తర్ అలీ ఖాన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా కోహ్లీ 111, రహానే 45 పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు కేఎల్ రాహుల్ రూపంలో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పుజారా 83 పరుగులు చేసి పెవిలియన్కు చేరగా, ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ కోహ్లీ సెంచరీలు సాధించారు.
బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టులో పుజారాకి ఇది 9వ టెస్టు సెంచరీ కాగా, కోహ్లీకి ఇది 16వ సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లా బౌలర్లలో అహ్మద్, మిరాజ్, ఇస్లాం తలో వికెట్ తీసుకున్నారు.