హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రస్తుతం తన కామెంటేటరీతో తరుచూ విమర్శలు పాలవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లకు కూడా తెలియని విషయం ఏంటంటే సంజయ్ మంజ్రేకర్ తాను క్రికెట్ ఆడిన రోజుల్లో ఏమంత గొప్ప బ్యాట్స్మన్ కూడా కాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
అయితే, 1988-89 వెస్టిండిస్ పర్యటనలో సంజయ్ మంజ్రేకర్ టీమిండియాకు తదుపరి సునీల్ గవాస్కర్ అవుతాడని విండిస్ క్రికెట్ లెజెండ్ సర్ వివ్ రిచర్డ్స్ అంచనా వేశాడు. ఆ సమయంలోనే సునీల్ గవాస్కర్ అంతర్జాతీయ వీడ్కోలు పలకడంతో పాటు సచిన్ టెండూల్కర్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టలేదు.
నవంబర్ 1987లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 22 ఏళ్ల సంజయ్ మంజ్రేకర్ మార్చి-ఏప్రిల్ 1989లో జరిగిన వెస్టిండిస్ పర్యటనకు ఎంపికయ్యాడు. దిలిప్ వెంగ్ సర్కార్ నాయకత్వం వహించిన ఈ జట్టు విదేశీ గడ్డపై అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టుగా అప్పట్లో నిలిచింది. ఈ పర్యటనలో రాణించిన యువ ఆటగాళ్లలో మంజ్రేకర్ ఒకడు.
ఈ పర్యటనలో భాగంగా వెస్టిండిస్ అండర్-23 జట్టుతో జరిగిన మ్యాచ్లో సంజయ్ మంజ్రేకర్ సెంచరీ సాధించాడు. అనంతరం వెస్టిండిస్ బోర్డు XIతో జరిగిన మ్యాచ్లో 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక, జమైకా జట్టుతో జరిగిన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లో 57 బంతుల్లో 41 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
జార్జి టౌన్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన తొలి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించడంతో మంజ్రేకర్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో మాత్రం 221 బంతుల్లో 108 పరుగులతో సెంచరీ సాధించాడు. కరేబియన్ పేస్ ఎటాక్ను ఎదుర్కొనడంలో భారత బ్యాట్స్మన్ ఈ పిచ్పై తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే, రెండో ఇన్నింగ్స్లో మంజ్రేకర్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పోర్ట్ ఆప్ స్పెయిన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సంజయ్ మంజ్రేకర్ (0, 1) పరుగులతో నిరాశ పరిచాడు. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 217 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అప్పట్లో 1962 తర్వాత ఈ స్టేడియంలో టీమిండియా ఓడిన తొలి టెస్టు ఇదే కావడం విశేషం. షబీనా పార్కు వేదికగా జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 47 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 41 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఆఖరి టెస్టులో సైతం టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయి నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 0-3తో చేజార్చుకుంది.
అనంతరం జరిగిన ఐదు వన్డేల సిరిస్ను 0-5తో చేజార్చుకుంది. అయితే, ఈ పర్యటనలో సంజయ్ మంజ్రేకర్ ఆటతీరుకు ముగ్ధుడైన వివ్ రిచర్డ్స్ సిరిస్ ఆనంతరం మాట్లాడుతూ "సంజయ్... టీమిండియా మరో గవాస్కర్ని కనుగొన్నది. అద్భుతమైన టెక్నిక్, ధైర్యం, సంకల్పం - ప్రతిదీ అతడిలో ఉంది" అని అన్నాడు.