కివీస్ పర్యటనలో ఏం చేయాలన్న దానిపై స్పష్టత ఉంది: ప్లైట్ ఎక్కడానికి ముందు కోహ్లీ

హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటనలో ఏం చేయాలన్న దానిపై స్పష్టత ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరిస్ ముగిసింది. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో నాలుగు రోజుల్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది.
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. కివీస్ పర్యటనకు బయల్దేరడానికి ముందు సోమవారం కోహ్లీ మాట్లాడుతూ గతేడాది కివీస్లో ప్రదర్శన ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపాడు.

పాజిటివ్ దృక్పథంతో
"ఈసారి పాజిటివ్ దృక్పథంతో బరిలో దిగుతున్నాం. ఈ పర్యటనలో ఏం చేయాలి అన్నదానిపై స్పష్టత ఉంది. విదేశాల్లో ఆడినప్పుడు ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టగలిగితే.. ఆ తర్వాత క్రికెట్ను ఎంజాయ్ చేయొచ్చు. సొంతగడ్డపై ఆతిథ్య జట్టుకు గెలవాలనే తపన ఉంటుంది. అద్భుతమైన ఆటతీరుని కనబరిస్తే వారిని ఒత్తిడిలో పడేయడం కష్టమేమీ కాదు" అని కోహ్లీ అన్నాడు.

ఈ సిరిస్ గెలవడం ఎంతో ముఖ్యం
న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో ఈ సిరిస్ గెలవడం ఎంతో ముఖ్యమని టీమ్ మీటింగ్లో జట్టులోని సహచర క్రికెటర్లకు చెప్పినట్లు కోహ్లీ తెలిపాడు. "మేము టీమ్ మీటింగ్లో దీని గురించి మాట్లాడాం. ఇది ఈ సిరీస్లో ఆడుతున్న చివరి ఆట, ఈ మ్యాచ్లో గెలిస్తే సంతోషంతో కివీస్ పర్యటనకు వెళతాం" అని అన్నాడు.

ఆసీస్పై ఎంతో ఒత్తిడిలో ఆడి గెలిచాం
"ఆసీస్పై గత రెండు వన్డేలూ ఎంతో ఒత్తిడిలో ఆడి గెలిచాం. ఇలాంటి విజయాలే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రపంచకప్ నుంచి ఒకే సూత్రం అనుసరిస్తున్నాం. టాస్ గెలిస్తే ఫర్వాలేదు. ఓడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాస్కు విలువ ఇవ్వకుండా ఆడుతున్నాం" అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

కివీస్ గడ్డపై కేవలం ఒకే ఒక్క టీ20లో గెలిచిన టీమిండియా
"ప్రత్యర్థి జట్టు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించిన సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. మనపై మనకు విశ్వాసం ఉంటే ఫలితాలు అవే వస్తాయి" అని కోహ్లీ తెలిపాడు. 2009, 2019 సిరీస్లను పక్కన పెడితే న్యూజిలాండ్లో అడుగుపెట్టి టీమిండియా వన్డే సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. కివీస్ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications