ధోనీతో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా:
ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్ సందర్భంగా.. మైదానంలో ఎవరితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావు? అని విరాట్ కోహ్లీని కెవిన్ పీటర్సన్ ప్రశ్నించగా.. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ అని సమాధానం ఇచ్చాడు. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపించలేనని అన్నాడు. 'నాతో పోటీపడుతూ వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తే వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాను. టీమిండియా తరఫున ఆడే సమయంలో ధోనీ.. ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడేటప్పుడు డివిలియర్స్ నా జాబితాలో ఉన్నారు. ఈ ఇద్దరితో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ల మధ్య పరుగు కోసం ప్రత్యేకంగా పిలుపులు ఉండవు. ఒకరినొకరు చూసుకుని పరుగెత్తేస్తామంతే' అని కోహ్లీ తెలిపాడు.
డివిలియర్స్ను స్లెడ్జింగ్ చేయలేదు:
'ఐపీఎల్లో డివిలియర్స్తో జోడిగా మైదానంలో ఆడటాన్ని బాగా ఇష్టపడతా. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపించలేను. డివిలియర్స్ అలాంటి వాడే. అతనితో నా స్నేహం ఎంతో ప్రత్యేకం. కాబట్టి నా కెరీర్లో ఎప్పుడూ అతడిని స్లెడ్జింగ్ చేయలేదు. అసలు కళ్లలో కళ్లు పెట్టి నేరుగా చూడలేదు' అని కోహ్లీ పేర్కొన్నాడు. '2008లో ఒకసారి గోల్ఫ్ ఆడాను. చక్కటి స్టాన్స్తో కవర్ మీదుగా సూపర్ షాట్ ఆడా. డివిలియర్స్ నా వద్దకు వచ్చి బంతి నువ్వే తెచ్చుకోవాలని చెప్పాడు. అంతే నేను మళ్లీ ఈ ఆట ఆడనని చెప్పేశా' అని భారత కెప్టెన్ చెప్పాడు.
ఐపీఎల్ గెలిచే అర్హత ఆర్సీబీకి ఉంది:
ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్ సందర్భంగా పీటర్సన్తో మాట్లాడేటప్పుడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోవడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. 'ఆర్సీబీ ప్రతి ఏడాది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. దీని వల్ల అభిమానుల్లో మాపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఈసారైనా గెలుస్తారంటూ అభిమానులు అనుకోవడం వల్ల ప్రతి మ్యాచ్లో ఒత్తిడి నెలకొంటుంది. ఇప్పటి వరకు మేము మూడు ఫైనల్స్ ఆడి రన్నరప్తో సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ అనసవరం. నిజాయితీగా చెప్పదల్చుకున్నాను ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలిచే అర్హత ఉంది' అని అన్నాడు.
ఎప్పటికి మరిచిపోలేని ఇన్నింగ్స్:
'2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 50 బంతుల్లో 113 పరుగులు చేయడం నా ఐపీఎల్ కెరీర్లో ఎప్పటికి మరిచిపోలేని ఇన్నింగ్స్. పంజాబ్తో మ్యాచ్లో నేను అనుకున్న రీతిలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. దక్షిణాఫ్రికాలో జరిగిన 2009-10 సీజన్లో నీతో (పీటర్సన్)తో పాటు కలిస్, బౌచర్, అనిల్ భాయ్, రాబిన్తో కలిసి ఆర్సీబీకి ఆడటం నాకు చిరకాలం గుర్తుంటుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ను బీసీసీఐ ఈనెల 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.