ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా భారత్తో ఫైనల్ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ను సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ హెచ్చరించాడు. భారత్ చేతిలో ఈసారి గెలవకపోతే తమ చోకర్స్ ట్యాగ్ను అధికారికంగా న్యూజిలాండ్కు ఇచ్చేస్తానని తెలిపాడు. ఫైనల్ నేపథ్యంలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్ వేదికగా జరిపిన సంభాషణలో డేల్ స్టెయిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్ చేరిన సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన సౌతాఫ్రికా.. కోల్కతా వేదికగా జరిగిన సెమీఫైనల్లో తేలిపోయింది. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో సౌతాఫ్రికాను చోకర్స్ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే ఏబీ డివిలియర్స్తో జరిగిన చర్చలో.. ఈసారైనా టీ20 వరల్డ్ కప్ టైటిల్ను గెలవాలని న్యూజిలాండ్ను డేల్ స్టెయిన్ కోరాడు. లేదంటే.. వారికి అధికారికంగా చోకర్స్ అనే ముద్ర వేస్తానని హెచ్చరించాడు. 'అందరూ సౌతాఫ్రికాను చోకర్స్ అని పిలుస్తుంటారు. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
న్యూజిలాండ్ కూడా ఇప్పటివరకు పెద్దగా వరల్డ్ కప్లు గెలవలేదు. పైగా మాకంటే ఎక్కువ సార్లు న్యూజిలాండ్ ఫైనల్స్ ఆడింది. కాబట్టి, న్యూజిలాండ్.. ఈసారైనా ప్రపంచకప్ గెలవండి. ఒకవేళ మీరు ఈసారి కూడా గెలవకపోతే.. మా 'చోకర్స్' ట్యాగ్ను మీకు అధికారికంగా ఇచ్చేస్తాను. అది ఇక మీదే.

నాకు న్యూజిలాండ్ అంటే ఇష్టమే కానీ, వారు భారత్ను ఓడించలేరు. భారత్ ఓడిపోవాలంటే వారు దారుణంగా విఫలవవ్వాలి. అది సాధ్యమే అని నేను అంటున్నాను. న్యూజిలాండ్ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ భారత్ను న్యూజిలాండ్ ఓడిస్తుందా? అంటే లేదు అనే చెబుతాను'అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
2000లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలిచినప్పటి నుంచి న్యూజిలాండ్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఐసీసీ ఫైనల్స్కు చేరుకుంది. కానీ అందులో గెలిచింది కేవలం ఒక్కటి మాత్రమే. అది 2021లో భారత్పై ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచింది.
న్యూజిలాండ్ క్రికెట్ ప్రయాణంపై ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ను గుర్తు చేసుకున్నాడు. ఆ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించే సత్తా కివీస్కు లేదని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోకుంటే.. ఆ ఫైనల్లో ఆస్ట్రేలియాను తమ జట్టు ఓడించి ఉండేదని చెప్పుకొచ్చాడు. వాళ్లు గెలవరు, తమని గెలవనివ్వరని సరదాగా వ్యాఖ్యానించాడు.
'ఆ టోర్నీ విషయంలో నాకు న్యూజిలాండ్ అంటే కోపం. 2015 ఫైనల్లో వారు ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. నేను ఇలా చెబుతున్నందుకు చాలా మంది నన్ను ద్వేషించవచ్చు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించగల ఏకైక జట్టు సౌతాఫ్రికా మాత్రమే. ఇప్పుడు మళ్ళీ న్యూజిలాండ్ ఫైనల్కు చేరింది. అది కూడా భారత్ గడ్డపై భారత్తో తలపడనుంది. క్రీడా దేశంగా న్యూజిలాండ్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఒకవేళ వారు ఈ టీ20 వరల్డ్ కప్ గెలిస్తే.. వాళ్లని విమర్శించినందుకు మమ్మల్ని చంపేస్తారేమో.' అని ఏబీడీ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.