10 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చిన బుమ్రా
ఈ మ్యాచ్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం 29 పరుగులిచ్చి కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్మెన్ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. 46వ ఓవర్లో అయితే కేవలం ఒకే ఒక పరుగిచ్చి కౌల్టర్ నీల్, కమిన్స్ల వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు.
|
సోషల్ మీడియాలో వీడియో వైరల్
చివరి మూడు ఓవర్లలో ఆసీస్ 18 పరుగులు చేయాల్సివుండగా.. 48వ ఓవర్లోనూ ఒక్క పరుగే ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండో వన్డేలో చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. భారత్ నెగ్గాలంటే... 2 వికెట్లు పడాలి. అటువైపు చూస్తే క్రీజులో మార్కస్ స్టోయినిస్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
ఒత్తిడిని తట్టుకుని విజయ్ శంకర్ బౌలింగ్
ప్రధాన బౌలర్లు బుమ్రా (2/29), షమీ (0/60) కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్ను మీడియం పేసర్ విజయ్ శంకర్తో వేయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అభిమానులంతా టీమిండియా ఓటమి ఖాయమే అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి అతడు వేసింది ఒకే ఓవర్. భారత అభిమానుల్లో ఉద్విగ్నత. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ శంకర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
స్టొయినిస్ను ఎల్బీగా ఔట్ చేశాడు
అనుభవం లేకపోయినా.. ప్రతిభకు కొదువలేదని విజయ్ శంకర్ నిరూపించాడు. తొలి బంతికే అతను స్టొయినిస్ను ఎల్బీగా ఔట్ చేసి దాదాపుగా మ్యాచ్ను ముగించాడు. రివ్యూలో కూడా ఫలితం భారత్కే అనుకూలంగా వచ్చింది. 6 వన్డేల కెరీర్లో అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ఇక, రెండో బంతికి జంపా (2) రెండు పరుగులు తీయడంతో మళ్లీ ఏదో ఓ మూలన సందేహం.
మూడో బంతిని యార్కర్గా
మూడో బంతి యార్కర్.. దెబ్బకు జంపా మిడిల్ వికెట్ లేచిపోయింది. ఇంకేముంది అప్పటి వరకు ఊపిరిబిగపట్టి చూసిన స్టేడియం మొత్తం సంబరాల్లో ముంచెత్తాడు. నిజానికి 46వ ఓవర్నే శంకర్తో వేయించాలని తాను అనుకున్నానని, అయితే బుమ్రా, షమీ వరుసగా నాలుగు ఓవర్లు వేసి 49వ ఓవర్లోనే ఆట ముగిస్తారని ధోని, రోహిత్ చెప్పిన సలహాను పాటించానని కోహ్లీ మ్యాచ్ తర్వాత చెప్పాడు.