మరికొన్ని రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు టెస్టు సిరీస్లో తలపడబోతున్నాయి. ఈ సిరీస్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్న ఇప్పటికే రెండు దేశాల అభిమానుల మధ్య పెద్ద చర్చకు తెరలేపింది. ఆయా జట్ల మాజీ ఆటగాళ్లు కూడా ఈ విషయంలో తమ తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ హేలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టుపై విమర్శల వర్షం కురిపించిన అతను.. భారత్ కనుక తొండాట ఆడకుంటే ఆస్ట్రేలియా ఈ సిరీస్ సులభంగా గెలుస్తుందన్నాడు.
భారత్ కనుక ప్రత్యేకంగా స్పిన్ కోసం పిచ్లు తయారు చేస్తే ఆస్ట్రేలియా ఓడిపోతుందని, అలా కాకుండా మంచి పిచ్లు తయారు చేస్తే ఆస్ట్రేలియానే గెలుస్తుందని హేలీ అన్నాడు. ఇలా స్వదేశంలో పరిస్థితులను క్యాష్ చేసుకోవడం అన్ని జట్లూ చేస్తున్న పనే. ఇప్పుడు నీతులు చెప్తున్న ఆస్ట్రేలియాతోపాటు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ , సౌతాఫ్రికా తదితర జట్లన్నీ కూడా తమ దేశాల్లో సిరీసులకు పేస్ ఫ్రెండ్లీ పిచ్లు తయారు చేస్తాయి. కానీ భారత్లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు తయారు చేస్తే అది కరెక్ట్ కాదని నీతులు చెప్తారా జట్ల మాజీ ఆటగాళ్లు.
హేలీ చేసిన వ్యాఖ్యలు మాజీ లెజెండ్ వసీం జాఫర్ చూశాడు. సోషల్ మీడియాలో వీటిని చూసిన జాఫర్.. హేలీకి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. 'మిస్టర్ హేలీ.. ఆస్ట్రేలియాలో 2018-19, 2020-21లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో పిచ్లను భారత్ తయారు చేయలేదు కదా.. ఇది కన్ఫర్మ్గా నాకు తెలుసు' అంటూ చురకలంటించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ సిరీసుల్లో భారత్ అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. ఇది చూసిన నెటిజన్లు వసీం జాఫర్ ఇచ్చిన సమాధానం అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.